వైయస్ జగన్ పై తాడోపేడో
రిలయన్స్ పై దాడులను వైయస్ జగన్ వ్యవహారానికి పరాకాష్టగా భావిస్తున్నారు. ప్రపంచంలోని బడా పారిశ్రామికవేత్తల్లో ఒకరైన ముకేష్ అంబానీపై ఆరోపణలు ఎక్కుపెట్టి, అదీ నమ్మశక్యం గాని ఊహాజనితమైన చిల్లర వైబ్ సైట్ కథనాన్ని పట్టుకుని రిలయన్స్ పై వార్తాకథనాలు ప్రసారం చేయించి, ముందు వేసుకున్న పథకం ప్రకారం రిలయన్స్ ఆస్తులపై దాడులు చేయించి అరాచకం సృష్టించడానికి జగన్ కావాలనే కుట్ర చేశారని పార్టీ అధిష్టానం నమ్ముతోందని ఢిల్లీ వర్గాలంటున్నాయి. ఈ స్థితిలో జగన్ ను ఏ మాత్రం ఉపేక్షించకూడదనే నిర్ణయానికి పార్టీ అధిష్టానం వచ్చినట్లు చెబుతున్నారు.
జగన్ కు అండదండలు అందిస్తున్న నాయకులపై, జగన్ ముఖ్య అనుచరులపై కొరడా ఝళిపించడానికి పోలీసులు కాంగ్రెసు అధిష్టానం కఠిన నిర్ణయం మేరకే జరుగుతోందని అంటున్నారు. వైయస్ మరణంపై కుట్ర వార్తాకథనం విషయంలో, రిలయన్స్ పై దాడి విషయాల్లో పోలీసులు సుమోటా కేసులు నమోదు చేస్తూ అరెస్టులకు దిగారు. పలువురు కాంగ్రెసు నాయకులపై పోలీసులు కేసులు పెట్టి అరెస్టు చేశారు. మాజీ మంత్రి మారెప్పపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో 550 మందికి పైగా కాంగ్రెసు కార్యకర్తలను అరెస్టు చేసినట్లు సాక్షి వార్తా పత్రికనే రాసింది. అది ఆదివారం రాత్రి వరకు ఉన్న పరిస్థితి సోమవారం మరిన్ని అరెస్టులు జరిగాయి. జగన్ కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడిన వంశీచందర్ రెడ్డి వంటివారిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. జగన్ రాజకీయంలోనూ, బయటా తనవైన సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకుని తమను సవాల్ చేయడానికి పూనుకున్నారనే నిర్ణయానికి కాంగ్రెసు అధిష్టానం వచ్చినట్లు సమాచారం. దీంతో జగన్ ను అణచివేయడం తప్ప మరో మార్గం లేదనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. అందుకే పోలీసుల పరంగా ఇప్పుడు పెద్ద యెత్తున చర్యలు మొదలయ్యాయని అంటున్నారు. ఈ స్థితిలో జగన్ భవిష్యత్తు కార్యక్రమమేటినేది అర్థం కావడం లేదు.