సాక్షి చానెల్ ఎదురుదాడి
దాడులు జరిగినప్పటి నుంచి సాక్షి టీవీ చానెల్ తో పలువురు రాజకీయ నాయకులు ప్రత్యేకంగా మాట్లాడుతూ రామోజీరావుపై, చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. వారిలో ప్రముఖలు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్. చంద్రబాబు మాటలకు అర్థాలు తీస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మాటలను బట్టి రిలయన్స్ తో చంద్రబాబుకు గల సంబంధాలు అర్థమవుతున్నాయని ఆయన ఆరోపించారు. గతంలో రిలయన్స్ కు రామోజీ రావు సంస్థలో బినామీ పేర్లతో పెట్టుబడులు పెట్టిందంటూ సాక్షి దినపత్రిక ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది. వివిధ రూపాల్లో రిలయన్స్ నుంచి కోట్ల రూపాయలు రామోజీ సంస్థలోకి వచ్చాయని ఆరోపించింది. దాన్ని ప్రస్తుత చంద్రబాబు వ్యాఖ్యలు బలపరుస్తున్నాయనేది ఉండవల్లి వ్యాఖ్యల అంతరార్థం.
కాగా, మాజీ తెలుగుదేశం నేత రోజా కూడా సాక్షికి అండగా వచ్చింది. సాక్షి టీవీ చానెల్ ప్రతినిధి ఆమెతో ప్రత్యేకంగా మాట్లాడించింది. సాక్షి టీవీకి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. దాడులు జరిగిన తెల్లారి నుంచి జగన్ ఆత్మరక్షణ కోసమా అన్నట్లు సాక్షి టీవీ చానెల్ లో ఇంటర్వ్యూలు, వార్తా కథనాలు వస్తున్నాయి. జగన్ అనుచరుండు వంశీచందర్ రెడ్డి మెసేజ్ లు ఇచ్చి పథకం ప్రకారం రిలయన్స్ ఆస్తులపై దాడులు చేయించారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు కూడా. తెలంగాణ నాయకులు కూడా జగన్ పై విరుచుకు పడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికే ఈ వ్యవహారాన్ని ముందుకు తెచ్చారని వి. హనుమంతరావు వంటి తెలంగాణ కాంగ్రెసు నాయకులు విరుచుకుపడ్డారు. ఏమైనా, సాక్షి టీవీని జగన్ రాష్ట్రంలో సంక్షోభాన్ని సృష్టించడానికి వేదికగా వాడుకుంటూ తిరిగి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కూడా దాన్నే వాడుకుంటున్నారనే అభిప్రాయం బలంగానే వినిపిస్తోంది.