సిఎం వార్నింగ్, జగన్ వర్గం కొత్త వ్యూహం

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన గురువారం కొందరు జగన్ వర్గం ఎమ్మెల్యేలు తనకు తారాసపడినప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హెచ్చరిక కూడా జారీ చేశారు. జగన్ వర్గం ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో సిఎంకు తారసపడ్డారు. ఈ సమయంలో సిఎం శివప్రసాద్ను ఉద్దేశించి ఏం శివప్రసాద్ ముప్పయ్యేళ్లకే మాజీ అవుతావా? అని నవ్వుతూ అన్నారు. దీనికి బూచేపల్లి నుండి ఎలాంటి సమాధానం రాలేదు. అయితే సిఎం అన్న వ్యాఖ్యలు మాత్రం వారికి హెచ్చరికలుగానే కనిపిస్తున్నట్లుగా ఉంది. అవిశ్వాసానికి మద్దతు ఇస్తే ప్రభుత్వం పడిపోతే సరి లేదంటే మరుక్షణమే వారి శాసనసభ్యత్వాలు రద్దవుతాయి. ప్రభుత్వం ఎలాగూ పడిపోయే పరిస్థితి లేనందున మరో రెండేళ్లు ఉన్న శాసనసభ్యత్వాలను ఇప్పడే ఎందుకు కోల్పోవాలనే ఆలోచనలో అత్యధిక ఎమ్మెల్యేలు ఉన్నారు.
కొంతమంది మాత్రం శాసనసభ్యత్వాలు కోల్పోయినా ఫరవాలేదన్న భావనలో ఉన్నారు. ఇన్నాళ్లు మద్దతిచ్చిన 26 మంది ఎమ్మెల్యేల మద్దతు కష్టం కావడంతో జగన్ వర్గం అవిశ్వాసంపై కొత్త వాదన తెరపైకి తీసుకు వచ్చినట్లుగా కనిపిస్తోంది. అదే దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిపై అభిమానం. ఎలాగూ అవిశ్వాసానికి అనుకూలంగా అత్యధిక ఎమ్మెల్యేలు ఓటు వేయరని భావించినందువల్లే, వైయస్పై అభిమానం ఉన్న వాళ్లే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని గురువారం పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రకటించినట్లుగా కనిపిస్తోంది. జగన్ కూడా స్వయంగా తన ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టడానికే అవిశ్వాసం అంటూ ఆందోళన వెలిబుచ్చారు. అయితే శాసనసభ్యత్వాలను కోల్పోవడం కంటే వైయస్ అభిమానం మిన్న అనేది అనుమానమే.












Click it and Unblock the Notifications