యుపిఎకు కరుణానిధి ముప్పు?

డిఎంకె తప్పుకుంటే యుపిఎ ప్రభుత్వం కొంత అస్థిరతకు గురయ్యే అవకాశాలున్నాయి. అయితే, ప్రభుత్వం పడిపోతుందనేది గ్యారంటీగా చెప్పలేం. ప్రస్తుతం యుపిఎకు 262 మంది సభ్యుల బలం ఉంది. 543 మంది సభ్యులున్న లోకసభలో కనీస మెజారిటీ 272. సమాజ్వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీతో పాటు పలు చిన్నా చితక పార్టీలు, స్వతంత్రులు మద్దతు ఇస్తుండంతో యుపిఎ ప్రభుత్వం మనుగడ సాగిస్తోంది. ప్రస్తుతం యుపిఎకు 313 సభ్యుల మద్దతు ఉంది. కానీ యుపిఎలో ఉన్న పార్టీలను మినహాయిస్తే మిగతా సభ్యులను నమ్మడానికి లేదు. దీనివల్ల 18 మంది సభ్యులున్న డిఎంకె యుపిఎలో ఉండడం కాంగ్రెసు చాలా అవసరం. యుపిఎ భాగస్వామ్య పక్షాల్లో 19 మంది సభ్యులున్న తృణమూల్ కాంగ్రెసు పార్టీ పెద్దది. ఆ తర్వాతి స్థానం డిఎంకెదే. ఆ పార్టీ యుపిఎ నుంచి తప్పుకుంటే వెంటనే ములాయం సింగ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ చేరే అవకాశం ఉంది. సమాజ్వాదీ పార్టీకి 20 మంది సభ్యులున్నారు. అందువల్లనే యుపిఎ ప్రభుత్వ మనుగడకు ప్రమాదం లేదని ములాయం సింగ్ యాదవ్ ఇప్పటికే ప్రకటించారు. సమాజ్వాదీ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన జయప్రద, అమర్ సింగ్ కూడా కాంగ్రెసుకు మద్దతు ఇవ్వవచ్చు.
యుపిఎ ప్రభుత్వంలో సమాజ్వాదీ పార్టీ తప్పుకుంటే బహుజన్ సమాజ్ పార్టీ బయటి నుంచి మద్దతు కొనసాగుతుందా, లేదా అనేది చెప్పలేం. డిఎంకె యుపిఎ నుంచి పూర్తిగా తప్పుకుంటే తాము చేరుతామని అన్నాడియంకె నేత జయలలిత ప్రకటించారు. అన్నాడియంకె ఇప్పుడు ఎటు కాకుండా ఉంది. వామపక్షాల నేతృత్వంలోని తృతీయ కూటమిలో ఉన్నట్లు భావిస్తున్నారు. కానీ దానితోనూ అది పూర్తిగా లేదు. డిఎంకె తప్పుకోవడం వల్ల ప్రభుత్వ మనుగడకు ప్రమాదమేమీ లేదు గానీ మిగతా భాగస్వామ్య పార్టీలు బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడితే మాత్రం తట్టుకోవడం కష్టమవుతుంది. ప్రభుత్వ మనుగడకు ప్రమాదం లేకపోవడంతో డిఎంకె హెచ్చరికలను కాంగ్రెసు పార్టీ అంతగా ఖాతరు చేయడం లేదు.
యుపిఎ నుంచి వైదొలగాలని డిఎంకె నిర్ణయించుకోవడానికి ప్రధాన కారణాలు సీట్ల సర్దుబాటుపై కాంగ్రెసు మొండి పట్టు ఒక్కటే కారణం కాదని తెలుస్తోంది. కాంగ్రెసు 63 శాసనసభ సీట్లు అడుగుతుండగా, డిఎంకె 60 సీట్లు ఇవ్వడానికి సిద్ధపడుతోంది. అందువల్ల సీట్ల సర్దుబాటు కుదరకపోవడం సాకు మాత్రమేనని తెలుస్తోంది. తమ నాయకుడు ఎ రాజాను మంత్రివర్గం నుంచి తప్పించడం, కరుణానిధి భార్యకు చెందిన టీవీ చానెల్ కార్యాలయంపై సిబిఐ దాడులు, కరుణానిధి కూతురు కనిమొళిని సిబిఐ ప్రశ్నించే అవకాశాలు ఉండండ కూడా కారణాలని తెలుస్తోంది. ప్రస్తుతానికి కాంగ్రెసు, డిఎంకె మధ్య చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడినట్లు భావిస్తున్నారు. రాజీనామాలు చేయడానికి ఢిల్లీ వెళ్లిన డిఎంకె కేంద్ర మంత్రులు కరుణానిధి కుమారుడు, కేంద్ర మంత్రి అళగిరి నివాసంలో సమావేశమయ్యారు. రాజీనామా పత్రాలు సమర్పించడానికి ప్రధాని అపాయింట్మెంట్ వారికి ఇంకా లభించలేదు. కాంగ్రెసుకు చెందిన గులాం నబీ ఆజాద్, ప్రణబ్ ముఖర్జీ తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె నేత కరుణానిధితో మాట్లాడుతున్నారు.












Click it and Unblock the Notifications