పవన్ కళ్యాణ్ స్థానంలో వంగవీటి రాధ
కాగా, దానికి చిరంజీవి విరుగుడు కనిపెట్టారు. వంగవీటి రాధాకృష్ణకు యువరాజ్యం బాధ్యతలు అప్పగించాలని ఆయన ఆలోచిస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ కు వంగవీటి రాధాకృష్ణ సన్నిహితుడు. అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ను కొనసాగిస్తూనే కార్యనిర్వహణ బాధ్యతలను రాధకు అప్పగించాలని ప్రయత్నాలు సాగిస్తున్నారని సమాచారం. వంగవీటి రాధాకృష్ణ చిరంజీవి తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన భావిస్తున్నారు. అయితే, రాధాను దూరం చేసుకోవడానికి చిరంజీవి సిద్దంగా లేరు. దీంతో రాధాకు యువరాజ్యం బాధ్యతలు అప్పగిస్తే రెండు రకాలుగా కూడా సమస్య పరిష్కారమవుతుందని చిరంజీవి అనుకున్నట్లు చెబుతున్నారు.
తన ఆలోచనపై చిరంజీవి వంగవీటి రాధాకృష్ణతో చర్చలు జరిపినట్లు సమాచారం. యువరాజ్యం క్రియాశీలక బాధ్యతలు చేపట్టేందుకు వంగవీటి రాధాకృష్ణ అంగీకరించినట్లు చెబుతున్నారు. సీమాంధ్రపైనే ఆశలన్నీ పెట్టుకున్న చిరంజీవి వంగవీటి రాధాకృష్ణ యువరాజ్యం తరఫున చురుగ్గా పని చేస్తే తనకు మరింత కలిసి వస్తుందని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. యువరాజ్యం క్రియాశీలక అధ్యక్షుడి హోదాలో రాధ చురుగ్గా పనిచేసే అవకాశాలున్నాయి. మెల్లగా పవన్ కళ్యాణ్ను కూడా తన పనిలో ఆయన భాగస్వామిని చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఇన్నాళ్లకు చిరంజీవి పార్టీపరంగా ఓ కలిసి వచ్చే పని చేస్తున్నారని చెప్పక తప్పదు.