జగన్ పార్టీ నేతల్లో, జగతి ఇన్వెస్టర్లలో గుబులు?
అయితే సాయిరెడ్డి అరెస్టు తర్వాత వారిలో కలవరం ప్రారంభమైనట్లుగా కనిపిస్తోంది. కేసులో రెండో నిందితుడైన సాయిరెడ్డిని అరెస్టు చేశాక, తర్వాతి వంతు ఎవరిది అనే ఆందోళనలో వారు ఉన్నట్లుగా ఉంది. తర్వాత వంతు ఎ-1గా ఉన్న జగన్ను అదుపులోకి తీసుకుంటారా? అనే అనుమానాలు పలువురిలో తలెత్తుతున్నాయి. ఇప్పటి వరకు జగన్ తన వర్గం నేతలకు మనకేమీ కాదు డోన్డ్ వర్రీ అంటూ భరోసా ఇచ్చే వారు. అయితే సాయిరెడ్డి అరెస్టుతో ఆయన వర్గంలో ధైర్యం సడలి పోతుందట.
సాయిరెడ్డి అరెస్టు తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోనే కాకుండా జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన పలు కంపెనీలు, వ్యక్తుల కూడా ఆందోళన చెందుతున్నట్లుగా కనిపిస్తోంది. జగన్ కంపెనీలతో పాటు ఆయన సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వ్యక్తులు, సంస్థల పేర్లను సిబిఐ తన ఎఫ్ఐఆర్లో చేర్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో జగన్, సాయిరెడ్డిలకు ఎంత పాత్ర ఉందో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొంది ఆపై జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వ్యక్తులు, సంస్థలకూ అంతే ప్రమేయం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయా కంపెనీల ప్రతినిధులూ, వ్యక్తులూ సిబిఐ ఎదుట విచారణకు హాజరయ్యారు.
జగన్ సంస్థల్లో అందరికన్నా ఎక్కువగా పెట్టుబడులు పెట్టిన వాన్పిక్ ప్రమోటర్ నిమ్మగడ్డ ప్రసాద్, పొట్లూరి వరప్రసాద్తోపాటు పెన్నా ప్రతాప రెడ్డి, ఇండియా సిమెంట్స్ తదితర కంపెనీల ప్రతినిధులు పలుమార్లు సిబిఐ ఎదుట విచారణకు హాజరయ్యారు. వీరిలో చాలామంది సాక్షి వాస్తవ విలువను ఎక్కువ చూపించడం వల్ల పెట్టుబడులు పెట్టామని సిబిఐ ముందు అంగీకరించి, అందుకు తగ్గట్లు వాంగ్మూలాలు అందచేసి కేసు నుంచి బయటపడే మార్గాలను వెతుక్కుంటున్నట్లు సమాచారం. సాయి రెడ్డితో తొలి అరెస్టు జరగడంతో జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన కంపెనీలూ, వ్యక్తులనూ సిబిఐ అరెస్టు చేయవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.