నెల రోజుల్లో ఎమ్మెల్యేలపై వేటు, జగన్ అరెస్టు?
ఆ లోగా జగన్ వర్గ ఎమ్మెల్యేలపై వేటు పడొచ్చని కొందరు భావిస్తున్నట్లుగా సమాచారం. రాజ్యసభ ఎన్నికలు జరిగే నాటికి కూడా జగన్ వర్గం వారు ఎమ్మెల్యేలుగానే కొనసాగితే అనవసరమైన కష్టనష్టాలు కొని తెచ్చుకున్నట్లు అవుతుందని, ప్రస్తుతం పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మతో కలిసి పద్దెనిమిది మందిగా ఉన్న జగన్ వర్గ ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో వేరే పార్టీకి సహకరించినా లేదా వారే ఎవరినైనా రాజ్యసభ సభ్యత్వానికి ప్రతిపాదించినా అదో పెద్ద సమస్యగా మారుతుందని కాంగ్రెసు భావిస్తోంది. అందువల్ల రాజ్యసభ ఎన్నికల్లోగా వారిపై వేటు వేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఇదే సమయంలో ఏప్రిల్ రెండో తేదీలోగా న్యాయస్థానంలో జగన్ అక్రమాస్తులకు సంబంధించి సిబిఐ చార్జ్షీట్ను దాఖలు చేయాల్సి ఉంది. దీంతో ఈ లోపు ఏ క్షణంలోనైనా జగన్ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారని సమాచారం. మార్చి మొదటి వారంలోనే యువనేత అరెస్టవుతారని కొందరు అంచనా వేస్తున్నారట.
ఒకవేళ జగన్ అరెస్టు అయి సానుభూతి పవనాలు ఏర్పడినా, అవి ఉప ఎన్నికలపై పడకుండా చూసుకోవాలన్న అభిప్రాయం నాయకుల్లో వ్యక్తమవుతోంది. మార్చిలోనే జగన్ను అరెస్టు చేసినా అదే నెలలో కాస్త అటు ఇటుగా ఆయన వర్గ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే ఉప ఎన్నికలు జరిగేందుకు ఆగస్టు వరకూ సమయం ఉంటుందని కాంగ్రెసు వర్గాలు అంచనా వేస్తున్నాయని తెలుస్తోంది. సిబిఐ అభియోగ పత్రం ద్వారా వెలుగులోకి వచ్చే అక్రమాస్తులు, అవకతవకలు, అధికార దుర్వినియోగం గురించి ప్రజల్లోకి బాగా వెళుతుందని వీరు భావిస్తున్నారట. జగన్ జైలుకు వెళ్లిన పక్షంలో ప్రజల ఆలోచనల్లో మార్పు వస్తుందని నెలలు గడిచే కొద్దీ సానుభూతి పూర్తిగా కరిగిపోతుందని వారు అనుకుంటున్నారని సమాచారం. అవినీతి ప్రధానంశంగా ప్రజల్లోకి వెళితే పార్టీకి విజయావకాశాలు మెరుగు పడతాయని వారు భావిస్తున్నారని తెలుస్తోంది.