ధర్మానను మినహాయిస్తే, వైయస్ జగన్కు దారి?
ధర్మానకు ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపు ఇస్తే మిగతా మంత్రులకు కూడా దాన్నే పాటించాల్సి వస్తుంది. దాంతో మోపిదేవి వెంకటరమణ విషయంలో కాంగ్రెసుపై తీవ్రమైన విమర్శలు రావచ్చు. మోపిదేవి వెంకటరమణకు అదే పద్ధతిని ఎందుకు అనుసరించలేదనే విమర్శలు వస్తే ప్రభుత్వంతో పాటు పార్టీ కూడా ఇరకాటంలో పడే అవకాశాలుంటాయి.
ఈ నేపథ్యంలో మంత్రుల క్వార్టర్లలోని మంత్రి ధర్మాన ప్రసాదరావుతో శుక్రవారం పలువురు మంత్రులు, నేతలు కలిశారు. మంత్రులు కొండ్రు మురళీమోహన్, బస్వరాజు సారయ్యలు విడివిడిగా ధర్మానను కలిసి మాట్లాడారు. మధ్యలో ధర్మానను మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె.చిరంజీవి, మంత్రులు గంటా శ్రీనివాసరావు, కాసు వెంకట కృష్ణా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య పరామర్శించారు.
ఇదే సమయంలో సచివాలయంలో మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి చాంబర్లో సహచరులు బస్వరాజు సారయ్య, ప్రసాద్ కుమార్ సమాలోచనలు జరిపారు. తర్వాత వారు ముగ్గురూ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ చాంబర్లో కొద్దిసేపు మంతనాలు చేశారు. ఎస్సీఎస్టీ సబ్ప్లాన్ వ్యవహారంలో తలమునకలైన డిప్యూటీ ముఖ్యమంత్రి మళ్లీ భేటీ కావాలని ఆ ముగ్గురు మంత్రుల నిర్ణయించుకున్నారు. మళ్లీ మంత్రుల క్వార్టర్స్లోని పిసిసి అధ్యక్షుని నివాసంలో బొత్స సత్యనారాయణ, కొండ్రు మురళీ మోహన్, ధర్మాన ప్రసాదరావు ఎడతెగని చర్చలు. ఇదే సమయంలో అక్కడకు డీఎల్ అక్కడకు చేరారు. మధ్యలో కొన్ని అంశాల సమాచారం కోసం తన నివాసానికి వెళ్లి వచ్చిన ధర్మాన తాను నిరపరాధినని వివరణ ఇచ్చారు.
శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రాజ్భవన్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను బొత్స సత్యనారాయణ కలిశారు. అనూహ్యంగా బొత్స అక్కడికి చేరుకున్న కొద్దిసేపటికే రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కూడా గవర్నర్ నరసింహన్ను కలిశారు. మరోవైపు, వైసీపీ నేత వైయస్ జగన్మోహనరెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి వాన్పిక్ వ్యవహారంలో మంత్రి ధర్మాన ప్రసాదరావును ఎ-5గా పేర్కొంటూ సీబీఐ దాఖలు చేసిన అభియోగపత్రంపై అధిష్ఠానానికి బొత్స ఇప్పటికే సమగ్ర నోట్ను పంపారు.
న్యాయనిపుణులతో సంప్రదించాల్సి ఉన్నందున రెండు రోజుల సమయం ఇవ్వాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి గడువు కోరగా అధిష్ఠానం సమ్మతించింది. కాగా, ఈ అంశంతో సహా రాష్ట్ర వ్యవహారాలన్నింటిపైనా చర్చించేందుకు ఢిల్లీకి రావాల్సిందిగా మఖ్యమంత్రి, పిసిసి చీఫ్లను అధిష్ఠానం పెద్దలు కోరారు. ఈ మేరకు శనివారం లేదా సోమవారం ఢిల్లీకి వెళ్లేందుకు సత్తిబాబు సన్నద్ధమవుతుంటే, పశ్చిమగోదావరి జిల్లాలో ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని ముగించుకుని సోమవారం తర్వాత వస్తానని ముఖ్యమంత్రి చెప్పారు.
దేశంలో ఎక్కడా అభియోగపత్రంలో నిందితునిగా పేర్కొన్న తర్వాత మంత్రి పదవిలో కొనసాగిన దాఖలాలు లేవని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి గులాం నబీ ఆజాద్ రాష్ట్ర ముఖ్య నేతలకు సంకేతాలు ఇచ్చారని పార్టీ వర్గాల సమాచారం. ఈ వ్యవహారం నుంచి తనను ముఖ్యమంత్రి గట్టెక్కిస్తారని భావిస్తూ వచ్చిన మంత్రి ధర్మానలో ఆత్మస్థయిర్యం దెబ్బతింటోందని, ఇక న్యాయపోరాటమే శరణ్యమన్న అభిప్రాయానికి వచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తన తప్పులేదని మాజీ మంత్రి షబ్బీర్ అలీతో ధర్మాన అధిష్టానానికి చెప్పించే ప్రయత్నం చేసినట్లు సమాచారం.
కీలకమైన సమయంలో ధర్మాన కుటుంబ సభ్యులు ఎమార్ ప్రాపర్టీస్లో స్థలాన్ని కొనుగోలు చేసినట్లుగా బహిర్గతం కావడం కూడా ఈ వ్యవహారంపై తీవ్ర ప్రభావం చూపే వీలుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ స్థలం కొనుగోలుకు సంబంధించిన లావాదేవీలన్నింటినీ సిబిఐ అధికారులకు తన కుమారుడు వివరించారని ధర్మాన అంటున్నారు. అయితే, ధర్మాన వ్యవహారంలో అధిష్ఠానం తీసుకునే నిర్ణయంపైనే జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలిన మంత్రుల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.