జగన్కు చెక్, కిరణ్కు షాక్:తెలంగాణ 'రెడ్డి'కి సిఎం?
తెలంగాణ సమస్యతో పాటు సీమాంధ్రలో జగన్ను రాజకీయంగా ఎదుర్కొనేందుకు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలని భావిస్తోందని అంటున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రిని, పిసిసి అధ్యక్షుడిని మార్చి, తెలంగాణకు చెందిన నేతలకే ఈ రెండు కీలక పదవులు అప్పగించాలని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ భావిస్తున్నారని అంటున్నారు. తెలంగాణ నుంచి రెడ్డి వర్గానికి చెందిన నేతను ముఖ్యమంత్రిగా, బిసి లేదా ఎస్సీ నేతను పిసిసి చీఫ్గా నియమించాలనే యోచన ఉన్నట్లు చెబుతున్నారు.
కిరణ్ కుమార్ రెడ్డిని నియమిస్తే సమస్యలు పరిష్కారమవుతాయని భావించిన అధిష్ఠానం ఆయన పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉందని చెబుతున్నారు. సోనియా కూడా కిరణ్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. త్వరలో పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల వరకు ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవని చెబుతున్నారు.
అయితే ఉప ఎన్నికలలో ఫలితాలు కాంగ్రెసుకు అనుకూలంగా ఉంటే సరే సరి. ఆశించిన ఫలితాలు రాకుంటే మాత్రం కిరణ్ను, బొత్సను మార్చాలని భావిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే ఆ దిశలో వారికి సంకేతాలు ఇచ్చారట. ఉప ఎన్నికల బాధ్యత మీదేనని వారిద్దరికి అధిష్టానం స్పష్టం చేసిందని అంటున్నారు. ఫలితాలు తారుమారైతే వారికి సోనియా షాక్ ఇచ్చే అవకాశాలే ఎక్కువ అంటున్నారు. ఫలితాలు అనుకూలంగా ఉంటే మాత్రం వారిపై వేటు ఉండే అవకాశం లేదని అంటున్నారు.
కాగా మరోవైపు నెలలోపు తెలంగాణకు ప్యాకేజీ రూపకల్పన పూర్తవుతుందని తెలుస్తోంది. ప్రత్యేక మండలిని ప్రకటించడంలో ఉన్న చట్టపరమైన అడ్డంకులను కూడా అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ సమావేశాలు మే 22న పూర్తి కాగానే ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు. తెలంగాణ నేతకు రాష్ట్ర సారథ్యం అప్పగించి భారీ ప్యాకేజీ ప్రకటిస్తే, ఉపాధి కల్పన జరిగితే ఆందోళనలకు ఆస్కారం ఉండదని, వచ్చే రెండేళ్లలో పరిస్థితి సానుకూలంగా మారుతుందని కూడా అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.