తెలంగాణపై మజ్లిస్ టార్గెట్: ఇరకాటంలో కెసిఆర్
ముస్లింలకు తాము మాత్రమే ప్రతినిధులు అయినట్లు మజ్లిస్ మాట్లాడుతోందని, దానిని తీవ్రంగా ఎండగట్టాలని బిజెపి జెఏసిలో చెప్పింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి, నాగర్కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డిని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి సమావేశానికి ఎందుకు ఆహ్వానించరని బిజెపి ప్రశ్నించింది. తెలంగాణ కోసమే పార్టీని వీడిన ముఖ్య నేతను విస్మరించడం సరికాదన్నారు.
నాగం జనార్ధన్ రెడ్డికి తెలంగాణ జెఏసి ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని బిజెపి జెఏసిలో కోరింది. నాగంని జెఏసిలోకి తీసుకోవాలని లోగడ తీసుకున్న నిర్ణయం ఎందుకు అమలు కాలేదని బిజెపితో సహా మిగిలిన పక్షాల ప్రతినిధులు కూడా కోదండరాంను నిలదీశారు. అందుకు ఆయన బదులిస్తూ.. భాగస్వామ్య పార్టీల అభిప్రాయాలు తీసుకొని నాగంను ఆహ్వానించాలని భావించామని చెప్పారు. నాగంను తీసుకోవడానికి అభ్యంతరం లేదని తామెప్పుడో చెప్పామన్నారు. తెరాస ఒప్పుకోకుంటే తీసుకోరా అని ప్రశ్నించారు. అలాగే జెఏసితో చర్చించకుండా కెసిఆర్ బందుకు పిలుపునివ్వడాన్ని కూడా ప్రశ్నించారు.
ఇరకాటంలో తెరాస
మజ్లిస్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా లేకున్నప్పటికీ ముస్లిం ఓట్లు ఎక్కడ దూరమవుతాయో అనే భావనతో తెలంగాణ రాష్ట్ర సమితి ఆ పార్టీని ఇప్పటి వరకు టార్గెట్ చేయలేదు. ఇప్పుడు కేవలం టిడిపి, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసులను మాత్రమే టార్గెట్ చేస్తూ... మజ్లిస్, సిపిఎంలను టార్గెట్ చేయక పోవడాన్ని బిజెపి సహా ఇతర భాగస్వామ్య పక్షాలు ప్రశ్నించడంతో జెఏసి, టిఆర్ఎస్ ఇరకాటంలో పడిందనే చెప్పవచ్చు.
కసబ్ ఉరిపై అవేం వ్యాఖ్యలు
ముంబయి దాడుల నిందితుడు అజ్మల్ కసబ్ ఉరి శిక్షను మజ్లిస్ పార్టీ నేతలు తప్పుపట్టడమేమిటని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కసబ్ ఉరిశిక్షను తప్పు పట్టడం అంటే కోర్టు నిర్ణయాన్ని ధిక్కరించడమే అన్నారు. అక్బరుద్దీన్ అదిలాబాద్ జిల్లా నిర్మల్లో జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని, అందుకు సంబంధించిన సిడిలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, గవర్నర్ నరసింహన్కు పంపిస్తామని చెప్పారు.
జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన మజ్లిస్ నేతల పైన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడమేమిటని ప్రశ్నించారు. రజాకార్ల వారసత్వంతో వచ్చిన పార్టీ మజ్లిస్ అని ధ్వజమెత్తారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా, ఎస్సీ, ఎస్టీలపై నోటికొచ్చినట్లుగా ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని, అలా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. నెల రోజుల్లో తెలంగాణపై కేంద్రం స్పష్టమైన వైఖరి తీసుకుంటుందని తాను భావించడం లేదన్నారు.