కిరణ్పై ముద్ర: త్రిమూర్తుల మంత్రాంగం (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ అంశంపై పిల్లి మెడలో గంట కట్టేందుకు ముగ్గురు రాష్ట్ర అగ్రనేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. రాష్ట్ర విభజనకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని తొలగించి, మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ను మందుకు తెస్తున్నారు. కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇందుకు అధిష్టానం పెద్దలను ఒప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
తెలంగాణపై ఇప్పటి వరకు ఏ విధమైన నిర్ణయమూ జరగలేదు. ఈ నెల 28వ తేదీన కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశమై తెలంగాణపై నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. ఈ స్థితిలో జైపాల్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, బొత్స సత్యనారాయణ కిరణ్ కుమార్ రెడ్డికి ఎసరు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యవాది అయిన కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే అనుకోని అవాంతరాలు రావచ్చునని, అందువల్ల ఆయన ప్రభుత్వం స్థానంలో ట్రాన్సిషనల్ గవర్నమెంట్ను ఏర్పాటు చేయడం మంచిదని వారు వాదిస్తున్నారు.
ట్రాన్సిషనల్ గవర్నమెంట్ను ఏర్పాటు చేయని పక్షంలో శాసనసభను సస్పెండెడ్ యానిమేషన్లో పెట్టి, రాష్ట్ర విభజన పూర్తయ్యే వరకు రాష్ట్రపతి పాలన విధించాలనే డిమాండ్ కూడా ముందుకు వస్తోంది. ఏమైనా, రాష్ట్ర విభజన విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి చేతికి వ్యవహారాలు వెళ్లకూడదనేది వారి అభిమతంగా కనిపిస్తోంది.
కిరణ్ రెడ్డిపై తెలంగాణ వ్యతిరేక ముద్ర
కోర్ గ్రూప్ సమావేశంలో కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన విషయాలు మీడియాకు వరుసగా లీకయ్యాయి. ఈ లీకులతో కిరణ్ కుమార్ రెడ్డిపై పూర్తిగా తెలంగాణ వ్యతిరేక ముద్ర పడింది. ఆయన సమైక్యవాదానికి అనుకూలంగా వ్యవహరిస్తూ రాష్ట్ర విభజన వ్యవహారాలను తలకిందులు చేసే ప్రమాదం ఉందనే భయాలు తెలంగాణ నాయకుల్లో వ్యక్తమవుతున్నాయి.
జైపాల్ రెడ్డి కీలక పాత్ర
రాష్ట్ర విభజన విషయంలో తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. రాష్ట్ర విభజన సజావుగా సాగడానికి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం స్థానంలో మధ్యంతర ప్రభుత్వాన్ని నిలబెట్టాలని ఆయన అధిష్టానం పెద్దలపై ఒత్తిడి తెస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
జైపాల్ రెడ్డికి బొత్స తోడు..
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కీలకమైన విభజన సమయంలో పక్కకు తప్పించాలనే విషయంలో జైపాల్ రెడ్డికి బొత్స సత్యనారాయణ తోడుగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే ట్రాన్సిషన్ గవర్నమెంట్కు నేతృత్వం వహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.
దామోదర లాబీయింగ్..
రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కీలకమైన నేతగా ముందుకు వచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి విషయంలో తమ భయాలను ఆయన అధిష్టానం పెద్దల ముందు వెల్లడించినట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఖాయమని ఆయన నమ్ముతున్నారు.
కిశోర్ చంద్రదేవ్పై నమ్మకం..
కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్పై తెలంగాణ నాయకులు కూడా విశ్వాసం ఉంచుతున్నట్లు చెబుతున్నారు. ట్రాన్సిషన్ గవర్నమెంట్కు ఆయన నేతృత్వం వహిస్తే మంచిదే అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అధిష్టానం సూచనలను తూచా తప్పకుండా పాటిస్తారనే ఉద్దేశంతో ఆ నమ్మకం పెడుతున్నట్లు కనిపిస్తోంది.
డి శ్రీనివాస్ కూడా ..
పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అధిష్టానానికి అత్యంత విశ్వాస పాత్రుడైన నాయకుడు. తెలంగాణకు చెందిన డిఎస్ తెలంగాణ విషయంలో సంయమనం, సహనం పాటిస్తూ వచ్చారు. ఇప్పుడు మాత్రం తెలంగాణ ఏర్పడడం ఖాయమని బహిరంగంగానే చెబుతున్నారు. ఆయన మాటలకు విశ్వసనీయత ఉంటుంది.
మర్రి శశిధర్ రెడ్డిపై విశ్వాసం..
తెలంగాణకు చెందిన మర్రి శశిధర్ రెడ్డి వివాదరహితుడు. పార్టీ అధిష్టానం మాటకు ఆయన కట్టుబడి ఉంటాడు. తెలంగాణ ఏర్పాటును ఆయన కాంక్షిస్తున్నప్పటికీ పెద్దగా అలజడి చేయని నేత ఆయన. ఆయనకు ట్రాన్సిషన్ గవర్నమెంట్ బాధ్యతలు అప్పగించవచ్చునని కూడా వాదిస్తున్నారు.
సోనియా ఇస్తారా...
కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇస్తారా, లేదా అనేది ఇంకా అనుమానంగానే ఉంది. ఈ నెల 28వ తేదీన జరిగే సిడబ్ల్యుసి సమావేశంలో తమకు అనుకూలంగా నిర్ణయం వస్తుందని తెలంగాణ కాంగ్రెసు నాయకులు గట్టిగా నమ్ముతున్నారు. అందుకు అనుగుణంగానే తెలంగాణ నేతలు పావులు కదిపే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, తెలంగాణపై నిర్ణయం వెలువడే దాకా అనుమానం పూర్తిగా నివృత్తి కాదు.
ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం పలువురు కాంగ్రెసు అధిష్టానం పెద్దలను కలిశారు. నవంబర్లోగా తెలంగాణ ఏర్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సజావుగా జరగదనే అభిప్రాయాన్ని దామోదర రాజనర్సింహ అధిష్టానం పెద్దల వద్ద వెల్లడించినట్లు చెబుతున్నారు. కాగా, ఇటీవల హైదరాబాద్లో తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డితో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వంలో మార్పులు చేయాల్సిన అవసరంపై వారిద్దరు చర్చించినట్లు చెబుతున్నారు. ఇదే విషయాన్ని అధిష్టానం పెద్దల వద్ద వెల్లడించడానికి జైపాల్ రెడ్డి ఢిల్లీకి వెంటనే వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. మధ్యంతర ప్రభుత్వానికి నేతృత్వం వహించాల్సిన నాయకుల పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్, జైపాల్ రెడ్డి, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పేర్లు ముందుకు వచ్చాయి. బొత్స సత్యనారాయణ కూడా ట్రాన్సిషన్ ప్రభుత్వానికి నేతృత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతుననారు. మొత్తం మీద, కిరణ్ కుమార్ రెడ్డిపై మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.