గత పాతబస్తీ పొలిటిక్స్: సాలార్ వర్సెస్ టైగర్
బిజెపి నేత బద్దం బాల్ రెడ్డి ఓసారి ఓవైసీని హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో ఓడించే దశకు చేరుకున్నారు. అతి స్వల్ప మెజారిటీతో ఓవైసీ బద్దం బాల్ రెడ్డిపై గట్టెక్కారు. పాతబస్తీలోని ఆలియాబాద్కు చెందిన బద్దం బాల్ రెడ్డి మజ్లీస్కు అడ్డుకట్ట వేయడానికి తీవ్రంగానే ప్రయత్నించారు. నరేంద్ర కూడా అంతే. అయితే, ఆ కాలంలో హైదరాబాద్ పాతబస్తీలో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటూ ఉండేవి. క్రమంగా నరేంద్ర బిజెపికి దూరమయ్యారు. బద్దం బాల్ రెడ్డి అప్పటిలాగా వ్యవహరించలేకపోతున్నారు.
సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ఆరు సార్లు హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. సల్లావుద్దీన్ ఓవైసీ తండ్రి అబ్దుల్ వాహెద్ ఓవైసీ మజ్లీస్కు నాయకత్వం వహించేవారు. ఆయన 1976లో మరణించిన తర్వాత పార్టీ పగ్గాలను సల్లావుద్దీన్ ఓవైసీ తన చేతుల్లోకి తీసుకున్నారు. చిన్నతనంలోనే ఆయన రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. తన తండ్రి జైలులో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.
సుల్తాన్ సల్లావుద్దీన్ 2004లో తప్పుకుని తన కుమారుడు అసదుద్దీన్ ఓవైసీకి మజ్లీస్ పగ్గాలు అప్పగించారు. అప్పటికే బిజెపి పాతబస్తీలో బలహీనపడింది. అయితే, ఓవైసీకి అమానుల్లా ఖాన్ నుంచి సవాల్ ఎదురైంది. ఆ సమయంలో తన చిన్నకుమారుడు అక్బరుద్దీన్ ఓవైసీని రంగంలోకి దింపి, అమానుల్లాఖాన్ ప్రాబల్యాన్ని తగ్గించగలిగారు.
అసదుద్దీన్ పార్టీ పగ్గాలు చేపట్టేనాటికి పాతబస్తీలో మజ్లీస్కు ఎదురు లేదు. పైగా, రాష్ట్రంలోని పాలక పార్టీలకు అనుగుణంగా మెలుగుతూ ఉండేవారు. తద్వారా వైద్యం, విద్య వంటి రంగాల్లోకి ఓవైసీ కుటుంబం విస్తరించింది. అయితే, మొదట్లో సిపిఐ పాతబస్తీలో పాగా వేయడానికి ప్రయత్నించింది. హిందూముస్లిం యువకులు వామపక్ష భావజాలంతో మత పార్టీలను ఎదుర్కునే ప్రయత్నాలు ఫలించలేదు.
మొత్తంగా, పాతబస్తీలో మజ్లీస్ ఆధిపత్యం కొనసాగుతూ వస్తోంది. అయితే, హైదరాబాదుకు మాత్రమే పరిమితం కాకుండా జిల్లాల్లో కూడా విస్తరించాలనే ఆకాంక్షతో అసదుద్దీన్ ఓవైసీ పాలక కాంగ్రెసు పార్టీతో తెగదెంపులు చేసుకున్నారు. తద్వారా ఒక వర్గం ప్రజలను పూర్తిగా తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆ ఫలితంగా హైదరాబాద్ పాతబస్తీలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. పాతబస్తీలో ఒక వర్గం కోసం అసదుద్దీన్ గానీ, అక్బరుద్దీన్ గానీ చేస్తున్న ప్రయత్నాలు పెద్ద ముప్పుగా బయటకు కనిపించలేదు. కానీ, అక్బరుద్దీన్ హైదరాబాద్ దాటి తన ప్రసంగాలు ప్రారంభించారు. దీంతో అక్బరుద్దీన్పై కేసులు బనాయించాల్సిన పరిస్థితికి దారి తీసింది.
అక్బరుద్దీన్ ద్వేషపూరిత ప్రసంగాల గురించి బయటి ప్రపంచానికి కూడా తెలియడంతో, తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతుండడంతో పోలీసులు కదలాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమతో మజ్లీస్ తెగదెంపులు చేసుకోవడంతో అక్బరుద్దీన్కు లోలోపల సహాయం చేయాల్సిన అవసరం కూడా కాంగ్రెసు పార్టీకి లేకుండా పోయింది.