జగన్ కంటే బాబే: విభజనపై టిడిపి 'లెక్క'(పిక్చర్స్)
తెలంగాణ అంశాన్ని మరో వారం పది రోజుల్లో తేల్చేస్తామని రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ చెప్పడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెసుపై నమ్మకం లేదని, అయితే తెలంగాణ ఇస్తే ఆహ్వానిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, సిపిఐ పార్టీలు చెబుతుండగా, సాధిస్తామని టి కాంగ్రెసు నేతలు చెబుతున్నారు. ఇక సీమాంధ్ర కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు తెలంగాణను కొట్టి పారేస్తున్నారు.
ఇంత జరుగుతున్న తెలుగుదేశం పార్టీ నేతల నుండి ఊహించినంత ప్రతిస్పందన కనిపించడం లేదంటున్నారు. అందుకు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హుకుమే కారణమని అంటున్న విషయం తెలిసిందే. అయితే పైకి ఏమీ మాట్లాడకున్నప్పటికీ లోలోన ఇరు ప్రాంత నేతలు ఈ అంశంపై జోరుగా చర్చించుకుంటున్నారు. విభజన జరుగుతుందా? జరిగితే పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎక్కడ లబ్ధి పొందుతాం? తదితర అంశాలపై జోరుగా చర్చించుకుంటున్నారు.
తెలంగాణ, రాయల తెలంగాణ ప్రచారం రాష్ట్రంలో రాజకీయ వేడి రాజేసినప్పటికీ తెలుగదేశం మాత్రం మౌనంగానే ఉంది. ఇరువైపుల నేతలు అధినేత ఆదేశాలతో ఏమీ మాట్లాడటే లేదు. తెలంగాణపై కాంగ్రెసు గేమ్ ఆడుతోందని భావించడం వల్లే చంద్రబాబు నేతలను మాట్లాడవద్దని ఆదేశించారట.
టిడిపి నేతలు పైకి ఏమీ మాట్లాడకపోతున్నప్పటికీ లోలోన మాత్రం ఇరు ప్రాంతాల నేతలు మథనపడుతున్నారట. విభజన జరుగుతుందా? జరిగితే ఎక్కడ లాభం? ఎక్కడ నష్టం? తదితర అంశాలపై జోరుగా చర్చించుకుంటున్నారట.
ఇతర పార్టీలకు చెందిన రెండు ప్రాంతాల నేతలు విభజనపై స్పందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాము స్పందించకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఆందోళనలో ఉన్నారట. అయితే కేంద్రం నుండి ఓ ప్రకటన వచ్చాక మాత్రం తప్పనిసరిగా స్పందించాలనే నిర్ణయానికి వచ్చారట.
విభజన జరిగితే సీమాంధ్రలో టిడిపి అధికారంలోకి రావడం ఖాయమని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం తప్పదని లెక్కలు వేసుకుంటున్నారట. తెలంగాణకు అనుకూలంగా ప్రకటన ఉంటే కాంగ్రెసును ప్రజలు దూరం పెడతారని, కొత్త రాష్ట్రానికి జగన్ కంటే బాబు సమర్థవంతమైన నేత అని ప్రజలు భావించి ఓటేస్తారని లెక్కలు వేసుకుంటున్నారట.
సీమాంధ్రలో అధికారంలోకి వస్తామని భావిస్తున్న టిడిపి తెలంగాణలో మాత్రం గట్టెక్కకపోవచ్చుననే ఆలోచనలో ఉందట. కాంగ్రెసు తెలంగాణ రాష్ట్రం ఇస్తే టిడిపి, బిజెపి, టిఆర్ఎస్ కాకుండా గుంపగుత్తగా కాంగ్రెసు పార్టీకే ఓట్లు పడే అవకాశాలున్నాయని, అయితే రాయల తెలంగాణ ఇస్తే మాత్రం టిడిపికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని భావిస్తోందట.
ఏ పరిణామం ఎలా ఉంటే లాభ నష్టాలు ఎలా ఉంటాయన్న దానిపై లెక్కలు వేసుకోవడంలో ఆ పార్టీ నేతలు నిమగ్నమయ్యారు. రాష్ట్రంలోని ఉభయ ప్రాంతాల నేతలు ఎవరి అంచనాల్లో వారున్నారు. తెలంగాణ, రాయల తెలంగాణ... ఇలా పలు సంకేతాలు వస్తున్నా ఇవి ఎంత వరకు వాస్తవరూపం దాలుస్తాయన్నది చూసిన తర్వాతే స్పందించాలనుకుంటున్నారట. విభజన జరగబోతోందన్న ప్రచారంపై టిడిపిలోని సీమాంధ్ర నేతలు ఒత్తిడికి గురవుతున్నారు. అయితే అధినేత సూచనల మేరకు బయట పడటం లేదు.
కేంద్ర ప్రభుత్వం విభజన ప్రకటన చేసిన తర్వాత కూడా వారి వైఖరి ఇలాగే ఉంటుందా అన్నది ఆ పార్టీలో చర్చనీయాంశంగా ఉంది. అయితే కలిసి ఉన్నా, విభజన జరిగినా తమకు ఏ మేరకు లాభనష్టాలు ఉంటాయనే చర్చ సాగుతోంది. విభజన జరిగితే సీమాంధ్రలో తాము అధికారంలోకి రాగలమని చాలామంది విశ్వాసం వ్యక్తం చేస్తున్నారట. విభజన ద్వారా సీమాంధ్రలో కాంగ్రెసు దెబ్బ తింటుందని, అప్పుడు పోటీ తమకు వైయస్సార్ కాంగ్రెసుకు మధ్యే ఉంటుందని, అనేక సమస్యల మధ్య ఏర్పడిన కొత్త రాష్ట్రానికి జగన్ కంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందన్న అభిప్రాయం ప్రజల్లో కూడా వస్తుందని భావిస్తున్నారట.
అయితే, తెలంగాణ నేతలు మాత్రం అంత ఆశావహంగా లేరని అంటున్నారు. రాయల తెలంగాణతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే కాంగ్రెస్కు, తమకూ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని, మిగిలిన పార్టీలు పోటీలో ఉండవని టిటిడిపి నేతలు భావిస్తున్నారట. కాంగ్రెస్ వల్లే తెలంగాణ వచ్చిందని ప్రజలు విశ్వసిస్తే తెరాస ప్రభావం తగ్గిపోతాయని, బిజెపి, వైయస్సార్ కాంగ్రెసులు నామమాత్రంగా మిగులుతాయని, తెలంగాణ ఇచ్చిందన్న అభిప్రాయంతో కాంగ్రెస్కు ఎన్నికల్లో లాభం జరగవచ్చునని భావిస్తున్నారు.
అయితే తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాలనను చూసి మొహం మొత్తిన ప్రజలు, ఈసారి ఆ పార్టీని వద్దనుకొంటే మాత్రం తమకు అవకాశం ఉంటుందని, సీమాంధ్రలో అధికారంలోకి వచ్చినా తెలంగాణలో మాత్రం అప్పుడే ఏమీ చెప్పలేని పరిస్థితి ఉందని పార్టీలో చర్చ సాగుతోందట. నేతల్లో ఈ చర్చ జోరుగా సాగుతుంటే పార్టీ అధ్యక్షుడు మాత్రం వీటిని పక్కన పెట్టి పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తున్నారు. ఆయన స్థానికంలో మంచి ఫలితాలు రావాలని కసరత్తు చేస్తున్నారు.