'వైఎస్ కొడుకని వదిలేశాం, చీప్ లిక్కర్ తాగినట్లు'
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన కాంగ్రెసు, తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీల నాయకులు ఆదివారం మండిపడ్డారు. శనివారం హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సమైక్య శంఖారావం సభలో ఆయన వ్యాఖ్యలపై ఆయా పార్టీల నాయకులు వేర్వేరుగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు అనే ఉద్దేశ్యంతో ఇన్నాళ్లూ ఊరుకున్నామని, సోనియాను విమర్శిస్తే మాత్రం సహించేందుకు కాంగ్రెసు కార్యకర్తలు సిద్ధంగా లేరని జిహెచ్ఎంసి కాంగ్రెసు నేత నగేష్ ఆగ్రహించారు. ఇంతకాలం వైయస్ కుమారిడాగా జగన్ను ఉపేక్షించామని, తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా మారిన జగన్ను ఇక మీదట సహించమన్నారు. అవినీతికి పాల్పడి పదహారు నెలల జైలు జీవితం గడిపిన జగన్కు సోనియాను విమర్శించే స్థాయి, నైతికత లేదన్నారు.

వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీకి ముప్పై స్థానాలు కాదని మూడు స్థానాలు కూడా రావని ప్రభుత్వ చీప్ విఫ్ గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. మాట తప్పం, మడమ తిప్పమన్న జగన్ తెలంగాణ విషయంలో తన నైజాన్ని బయటపెట్టుకున్నారన్నారు. జగన్కు తెలంగాణ చరిత్ర తెలియదని, ఈ ప్రాంత చరిత్ర గురించి తెలుసుకొని మాట్లాడాలని నిజామాబాద్ ఎంపి మధుయాష్కీ అన్నారు. జైలు నుండి వచ్చన జగన్ చీప్ లిక్కర్ తాగినట్లుగా మాట్లాడుతున్నారన్నారు.
సభలో జగన్ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. హైకోర్టు ఆయన వ్యాఖ్యలను పరిశీలించాలన్నారు. జాతీయ గీతాలాపనలో అవమానించే విధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. విభజనకు ఆద్యుడు వైయస్ రాజశేఖర రెడ్డేనన్న నిజాన్ని జగన్ తెలుసుకుంటే మంచిదని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు అన్నారు.
భారీ వర్షాలకు రాష్ట్ర ప్రజానీకం తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే ముఖ్యమంత్రి సీటు కోసం జగన్ సమైక్య సభ పెట్టడం దురదృష్టకరమని మంత్రి బస్వరాజు సారయ్య వ్యాఖ్యానించారు. వందమంది బాబులు, వెయ్యిమంది జగన్లు వచ్చినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆగదన్నారు. జగన్ ఓ పిల్ల కుక్క.. తన స్థాయిని మరిచి విమర్శలు చేస్తున్నారని గండ్ర వెంకటరమణా రెడ్డి వ్యాఖ్యానించారు.
సోనియా గాంధీని ఇటలీ అని విమర్శిస్తున్నావు. ఆమెకు వంగివంగి నమస్కారాలు చేసినప్పుడు గుర్తుకు రాలేదా.. నీ తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డిని రెండుసార్లు ముఖ్యమంత్రిని చేసినప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదా అని ఎంపి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. జైలు జీవితం గడిపి ఉండటం వల్ల జగన్ మానసిక స్థితి బాగా లేదని, అతనికి వైద్య పరీక్షలు జరిపించాలని లోక్సభ స్పీకర్కు లేఖ రాస్తానన్నారు.
రాహుల్ని ప్రధానిని చేయడానికే సోనియా రాష్ట్రాన్ని విభజిస్తోందని విమర్శించిన జగన్ తన తండ్రి శవం పక్కనే సంతకాల సేకరణ ఎందుకు జరిపారో గుర్తుకు తెచ్చుకోవాలని ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. రక్తం తాగే జగన్కు జాతీయగీతం గురించి, కల్లు గురించి ఏం తెలుసునని యాష్కీ వ్యాఖ్యానించారు. వైయస్ రాజశేఖర రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టిన సోనియాని విమర్శించే హక్కు జగన్కు లేదని ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్రెడ్డి అన్నారు.
కేవలం రాష్ట్రంలో అధికారం కోసమే జగన్ సమైక్యరాగం ఆలపిస్తున్నారని, కుర్చీ కోసమే సమైక్యగళం వినిపిస్తున్నారని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన విషయంలో జగన్ది డబుల్ గేమ్ అని ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి విమర్శించారు.
సీమాంధ్ర ప్రజల్లో విష బీజం నాటే విధంగా వైయస్ జగన్ సమైక్య శంఖారావంలో ప్రసంగించారని తెరాస ఎంపి వివేక్, ఎమ్మెల్యే కెటి రామారావులు అన్నారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా సభలు నిర్వహిస్తున్న జగన్ను మళ్లీ జైలుకు పంపాల్సి వస్తుందని ధ్వజమెత్తారు. జగన్ రాసిచ్చింది చదవడం కాకుండా రాష్ట్ర చరిత్ర తెలుసుకోవాలని తెరాస నేత వినోద్ కుమార్ మండిపడ్డారు. రాష్ట్రం విడిపోయాక ఆ పార్టీ 30 ఎంపీ సీట్లు ఎలా గెలుస్తుందో చెప్పాలన్నారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా ఆదేశాల మేరకే జగన్ ప్రజలను మభ్యపెడుతున్నారని టిడిపి సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. కాంగ్రెసు, తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కలిసి తమ పార్టీని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాయని టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. ఆ మూడు దోపీడీ దొంగల పార్టీలు అన్నారు. సోనియా ఆశీస్సులతోనే జగన్ హైదరాబాదులో సభ నిర్వహించారన్నారు. జగన్ సభను కోదండ, కెసిఆర్లు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు.
వైయస్ కుటుంబాన్ని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీని తెలంగాణ ప్రజలు ఎప్పుడో వెలివేశారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఇక్కడ మోసం చేసిన వారు రాయలసీమ, కోస్తాంధ్రలో మోసం చేయరా అని ప్రశ్నించారు. హైదరాబాద్లో జరిగిన జగన్ సభ ఓ కుట్ర అని విరసం సభ్యుడు వరవర రావు ఆరోపించారు. తెలంగాణలో చేతిలోని బుక్క నోటికి చేరకముందే వందలాది యువతీయువకులు ఎన్కౌంటర్ అయిన చరిత్ర ఉందని, ఈ క్రమంలో పాలకవర్గాల భాగస్వామ్యంతోనే జగన్ సమైఖ్య శంఖారావాన్ని హైదరాబాద్లో ఊదారని మండిపడ్డారు. తెలంగాణ వైతాళికుల పేర్లు కూడా సరిగా ఉచ్చరించని జగన్కు తెలంగాణ చరిత్ర ఏమి తెలుసని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications