చేరికలు: విలీనంపై కెసిఆర్ మెలికలు, ఇక పొత్తే

విభజనకు పార్లమెంటు ఆమోదం, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా రాజకీయ వ్యూహాన్ని ఖరారు చేసుకొని ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. కీలక సమయంలో అనిశ్చితి రాజకీయంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్లో విలీనం, పొత్తుపై సోమవారం భేటీలో అందరూ అభిప్రాయాలు వెల్లడించి, నిర్ణయాధికారాన్ని పార్టీ అధ్యక్షుడికి కట్టబెడుతూ తీర్మానిస్తారని చెబుతున్నారు.
అదే జరిగితే, ఇప్పటికే క్షేత్ర స్థాయిలోని కేడర్తోపాటు, పలువురు పార్టీ ముఖ్యులు విలీనం, పొత్తుకు విముఖత చూపుతున్న నేపథ్యంలో కెసిఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. ఇక విలీనం, పొత్తుకు ఆసక్తి చూపని పార్టీ నేతలు కొందరు, బిజెపితో వెళితే ఎలా ఉంటుందని ఆరా తీస్తున్నారట. కాంగ్రెస్లో విలీనానికి వ్యతిరేకమని, తెలంగాణ కోసం ఒక పార్టీ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని చెబుతూ, పొత్తుకు తలుపులు తెరిచి ఉంచితే ఎలా ఉంటుందనే చర్చ కూడా జరుగుతోంది.
మరోవైపు ఒంటరిగానే ఎన్నికలు వెళితే బాగుంటుందని ఒక వర్గం బలంగా కోరుకుంటోంది. విలీనం, పొత్తు, ఒంటరి పోరు... ఇలా అన్ని అంశాలపై కెసిఆర్ దృష్టి సారించారు. కెసిఆర్ విలీనం అంశాన్ని దాదాపు పక్కన పెట్టేసినట్లేనని చెబుతున్నారు. విలీనాన్ని పక్కన పెట్టే ఉద్దేశ్యం లేకుంటే పార్టీలో ఇతర పార్టీల నేతలను ఎందుకు చేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు.
కెసిఆర్ పొత్తు లేదా ఒంటరిగా వెళ్లేందుకే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని చెబుతున్నారు. పలువురు టిడిపి నేతలు తెరాసలో వరుసగా చేరుతున్నారు. భారీగా తెరాసలోకి చేరికలు జరుగుతుండటంతో పాటు తెలంగాణ పునర్ నిర్మాణం తమతోనే సాధ్యమని తెరాస చెబుతోంది. తమ పార్టీ విలీనానికి సుముఖంగా లేదని చెప్పి కెసిఆర్ విలీనానికి దూరం జరగవచ్చునని చెబుతున్నారు. విలీనం అంశం దాదాపు తేలిపోయిందని, ఇక తేలాల్సింది పొత్తు విషయమే అంటున్నారు.












Click it and Unblock the Notifications