పదవిపై కిరణ్ ససేమీరా: వారిపై అధిష్టానం డైలమా?
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పదవి వదులుకునేందుకు సిద్ధంగా లేరు. సోమవారం విలేకరులతో మాట్లాడిన కిరణ్.. తనకు పదవి ముఖ్యం కాదని, రాష్ట్ర ప్రయోజనాల ముందు తన ముఖ్యమంత్రి పదవి చాలా చిన్న విషయమని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కృషి చేస్తానని చెప్పారు. అదే సమయంలో ముఖ్యమంత్రిగా ఉంటూనే తాను సమైక్యాంధ్ర కోసం పాటుపడుతానని చెప్పారు.
తాను సమైక్యాంధ్ర అంటే సీమాంధ్రకు అనుకూలంగా మాట్లాడుతున్నారని అంటున్నారని, మూడు ప్రాంతాలకు తనకు ముఖ్యమే అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, ఒక్క సమస్యను పరిష్కరించేందుకు మరిన్ని సమస్యలు సృష్టించవద్దన్నారు. పార్టీ అధిష్టానం విభజన నిర్ణయాన్ని తప్పుపడుతున్న కిరణ్ పదవి వదులుకునేందుకు మాత్రం సిద్ధంగా లేరు.
ముఖ్యమంత్రిగా ఉంటూనే సమైక్యాంధ్ర కోసం కృషి చేస్తానంటున్నారు. తాను ప్రస్తుతం పదవిని వదులుకోవడం లేదని, అలా చేస్తే సమైక్యాంధ్రకు న్యాయం జరగదని చెప్పారు. విభజన అంశంపై అసెంబ్లీలో చర్చ జరగాలని, ప్రజల ఆవేదనను ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో చెప్పిన అనంతరం వారి అభిప్రాయాల మేరకు విభజనపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఆ తర్వాతనే తన పదవి విషయమై ఆలోచిస్తానని అభిప్రాయపడ్డారు.
ఓ వైపు సమైక్యాంధ్ర కోసం ఫైట్ చేసేందుకు కిరణ్ పదవి వదులుకునేందుకు సిద్ధంగా లేని నేపథ్యంలో అధిష్టానం ఆయనను తొలగించి ఆ స్థానంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, బొత్స సత్యనారాయణలను ఆ పదవిలో కూర్చుండబెట్టాలని ఆలోచిస్తున్నారట. కిరణ్ తనంతట తాను వెళ్లాలని అధిష్టానం భావిస్తోందని అంటున్నారు. అయితే ఆయన అందుకు సుముఖంగా లేకపోవడంతో ఎలాగైనా ఇంటికి పంపించాలని చూస్తోందట.
కిరణ్ను పంపిస్తే ఆయన స్థానంలో బొత్స సత్యనారాయణ పేరు ప్రధానంగా వినిపిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఆయన కాదంటే ఆనం రామనారాయణ రెడ్డికు అవకాశం లభిస్తోందని వినిపిస్తోంది. మరోవైపు అధిష్టానం తనంతట తాను కిరణ్ను ఇంటికి పంపించే పరిస్థితి లేదని కూడా అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి కిరణ్ను ఇంటికి పంపించి... బొత్స, ఆనంలకు అవకాశం ఇవ్వాలా లేదా మరొకరికి ఇవ్వాలా అనే విషయం ఢిల్లీ పెద్దలు సమాలోచనలు చేస్తున్నారట.