జన హితానికి జమిలీ ఎన్నికలే: ఇదీ నీతి ఆయోగ్ సిఫారసు
2024 నుంచి లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు నిర్వహించాలని నీతి ఆయోగ్ సూచించింది. రెండు దశల్లో ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పింది. మూడేళ్ల అజెండా పేరుతో ఇటీవల కేంద్రానికి అందించిన నివేదికల
Recommended Video

న్యూఢిల్లీ: జాతి హితం దృష్ట్యా 2024 నుంచి లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు నిర్వహించాలని నీతి ఆయోగ్ సూచించింది. రెండు దశల్లో ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పింది. మూడేళ్ల అజెండా పేరుతో ఇటీవల కేంద్రానికి అందించిన నివేదికలో ఈ మేరకు తన అభిప్రాయం తెలిపింది.
ప్రభుత్వం ప్రచార సరళిలో పనిచేయడం పరిపాలనపై ప్రభావం చూపుతోందని, ఈ 'ప్రచార సరళి'ని కనిష్ఠ స్థాయికి తగ్గించాలంటే ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడమే మంచిదని అభిప్రాయ పడింది.
పలు దఫాల్లో ఎన్నికలు జరుగడం వల్ల పాలనకు అంతరాయం ఏర్పడుతున్నదన్నది. దేశానికి ఎంతో మేలు చేసే జమిలి ఎన్నికల విధానంపై విస్తృత చర్చ జరిగిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని సూచించింది. వివిధ రంగాల నిపుణులతో ఓ కమిటీని వేసి సాధ్యాసాధ్యాలపై నివేదిక తెప్పించుకోవాలని సూచించింది.

అవసరమైతే రాజ్యాంగ సవరణలు చేయాలని సూచన
ఇందుకు 2024 నుంచి రెండు దశల్లో జమిలి ఎన్నికలు నిర్వహించే దిశగా పనులు ప్రారంభించాల్సి ఉంది. అందుకోసం రాష్ట్ర అసెంబ్లీల కాల పరిమితిని ఒక్కసారికి పెంచి, తగ్గించడమో చేయాల్సి ఉంటుంది. దీని అమలుకు రాజ్యాంగ నిపుణులు, మేధావులు, ప్రభుత్వాధికారులు, పార్టీల ప్రతినిధులతో అధ్యయన బృందం ఏర్పాటు చేయాలి. అవసరమైన రాజ్యాంగ, చట్టాల సవరణ కోసం తగిన సూచనలు ఇవ్వడంతో పాటు, కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందించాలి. ఈ ప్రక్రియ నిర్వహణకు ఎన్నికల సంఘం సమన్వయకర్తగా వ్యవహరిస్తుంది.
అందుకు అవసరమైతే రాజ్యాంగానికి కొన్ని మార్పులు, చేర్పులు చేయాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. ఏ సమయంలో ఏది చేయాలన్న విషయమై 2018 మార్చి నాటికి టైమ్ టేబుల్ తయారు చేయాల'ని సూచించింది. గత ఏడాది దీపావళి సందర్భంగా బీజేపీ నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ జమిలి ఎన్నికలను ప్రస్తావించారు. అన్ని రాజకీయ పార్టీలు చర్చించి ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సైతం జమిలి ఎన్నికల విధానంపై చర్చ జరుగాల్సి ఉన్నదన్నారు.

2014లో రూ.4000 కోట్లకు చేరిన వ్యయం
దేశంలో ఎన్నికల ఖర్చు ప్రతిసారి పెరిగిపోతున్నది. 2009లో జరిగిన ఎన్నికలకు రూ.1,100 కోట్లు ఖర్చుకాగా, 2014 నాటికి అది రూ.4 వేల కోట్లకు చేరింది. దాదాపు కోటి మంది ఉద్యోగులు ఎన్నికల కోసం పనిచేయాల్సి వచ్చింది. పలు విడుతల్లో ఎన్నికలు నిర్వహించడం వల్ల భద్రతా బలగాలపైనా అదనపు భారం పడడంతోపాటు, దాడుల ముప్పు పెరుగుతున్నది. టీచర్లు ఎక్కువగా విధులకు వెళ్తుండడంతో విద్యారంగంపై చెడు ప్రభావం పడుతున్నదనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది.

జమిలీతోనే భారం నివారణ అన్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జమిలి ఎన్నికలపై మొగ్గు చూపిన నేపథ్యంలో నీతి ఆయోగ్ సిఫార్సు ప్రాధాన్యం సంతరించుకున్నది. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ సందేశంలో ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ ‘ఎన్నికల సంస్కరణలపై నిర్మాణాత్మక చర్చలు జరగాల్సి ఉంది. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో జరిగేవి. మళ్లీ ఆ విధానం అనుసరించాల్సి ఉంది. దీనిపై ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపాలి' అని పేర్కొన్నారు. ఫిబ్రవరిలో లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగించిన ప్రధాని మోదీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
‘జమిలి ఎన్నికల వల్ల మాతో పాటు అందరికీ కొంత నష్టం జరుగుతుంది. పార్టీలు దీన్ని రాజకీయ సంకుచిత దృష్టితో చూడకూడదు. నిరంతరం ఎన్నికలు జరుగుతున్నందు వల్ల వ్యయం పెరుగుతోంది. 2009 లోక్సభ ఎన్నికల్లో వ్యయవం రూ.1100 కోట్లు ఉంటే, 2014 నాటికి అంది రూ.4000 కోట్లకు పెరిగింది. ఉపాధ్యాయులు సహా కోటి మందికిపైగా ప్రభుత్వోద్యోగులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నారు. దీనివల్ల ముఖ్యంగా విద్యారంగానికి తీవ్రమైన నష్టం జరుగుతోంది. దేశ శత్రువులు సవాళ్లు విసురుతున్న సమయంలోనే భద్రతా బలగాలను ఎన్నికల కోసం మళ్లించవలసి వస్తోంది' అని పేర్కొన్నారు. ఈ సమస్యలను అధిగమించడానికి ఏకకాల ఎన్నికలే మార్గమని సూచించారు.

నిరుద్యోగిత నివారణకు ఇవి మార్పులు
అర్హతలకు తగినవి కాక ఏదో ఒక ఉద్యోగం చేసే ప్రచ్ఛన్న నిరుద్యోగతే నేటి ప్రధాన సమస్య అని నీతి ఆయోగ్ పేర్కొంది. ఉత్పాదకతను గణనీయంగా పెంచే, మంచి వేతనాలు లభించే ఉద్యోగాలపై దృష్టి సారించాల్సి ఉందని సూచించింది. దేశంలో ఉద్యోగాలు సృష్టించని ఆర్థికాభివృద్ధి జరుగుతోందన్న అభిప్రాయం సరికాదని తెలిపింది. ఉద్యోగాలు వస్తున్నాయని, కానీ అవి అర్హతకు తగినవి కాదని పేర్కొంది. ప్రస్తుతం నిరుద్యోగం సమస్య కాదని, అర్హతలకు తగిన ఉద్యోగం ఇవ్వని ప్రచ్ఛన్న నిరుద్యోగతే సమస్య అని వివరించింది. తీర ప్రాంత ఉద్యోగ మండళ్లు (కోస్టల్ ఎంప్లాయిమెంట్ జోన్-సీఈజడ్)లు ఏర్పాటు చేసే కార్మిక శక్తిని అధికంగా ఉపయోగించే చైనాలోని బహుళజాతి సంస్థలు దేశానికి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఇటీవల వస్త్ర పరిశ్రమలో ఉద్యోగులకు నిర్దిష్ట కాలపరిమితిని విధించారని, మిగిలిన పరిశ్రమల్లోనూ దీనిని అమలు చేయాల్సి ఉందని తెలిపింది. ఇందుకోసం చట్టాల్లో తగిన మార్పులు చేయాలని సూచించింది.

భూగర్భ జలాల నిల్వలపై అధ్యయనం చేయాలి
కిందిస్థాయి న్యాయస్థానాలపై భారం తగ్గించడంలో భాగంగా ట్రాఫిక్ చలాన్ల కేసుల కోసం ప్రత్యేకంగా కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ కోర్టులను నిర్వహించడానికి న్యాయ కోర్సుల విద్యార్థులను నియమించాలంటూ 2014లో లా కమిషన్ చేసిన సిఫార్సులను ప్రస్తావించింది. ట్రాఫిక్ ఉల్లంఘించిన వారు న్యాయస్థానానికి వచ్చి జరిమానా చెల్లించాలన్న నిబంధనను రద్దు చేసి, ఆన్లైన్ ద్వారా చెల్లించే అవకాశం కలిగించాలని సూచించింది. భూగర్భ జలాలను సక్రమంగా వాడుకోవడంతో పాటు, వాటి నిల్వలను పెంచే విధంగా చర్యలు తీసుకోవడంపై 2018లోగా అధ్యయనం చేయించాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. దేశంలో జలవనరుల సామర్థ్యం ఎంతో కూడా తెలుసుకోవాలని సూచించింది.

పునరుత్పాదక ఇంధనంపై దృష్టి
ప్రస్తుతం ఒక సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్లో కేటాయింపులు జరుపుతున్నారని, అలా కాకుండా ఒక మధ్య తరహా కాలాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. దీని వల్ల కేటాయింపులపై సమీక్షలకు అవకాశం కలుగుతుందని పేర్కొంది. 2019-20 నాటికి 100 గిగా వాట్టుల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పాదన చేయాలని సూచించింది. అప్పుడే 2020 నాటికి 175 గిగావాట్టుల ఉత్పాదన చేయాలన్న లక్ష్యం సాధ్యమవుతుందని తెలిపింది. ఘనవ్యర్థాలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్యంలో విద్యుత్తు ఉత్పాదన కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించింది. దీని కోసం ‘వేస్ట్ టు ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా'ను నెలకొల్పాలని సిఫార్సు చేసింది.












Click it and Unblock the Notifications