జగన్‌కు కౌంటర్‌: రాయలసీమలో రెండో రాజధాని సెగ

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కచ్చితమైన అభిప్రాయంతో ఉన్నట్లు అర్థమవుతోంది. రాజధానిని గుంటూరు, విజయవాడ నగరాల మధ్య ఏర్పాటుకు ముఖ్యమంత్రి సిద్ధపడిన నేపధ్యంలో కర్నూలులో రెండో రాజధాని ఏర్పాటు చేయాలని నేతలు పట్టుబడుతున్నారు. అలాగే ఏటా ఒక విడత అసెంబ్లీ సమావేశాలు కర్నూలులో నిర్వహించాలని, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో సిఎంపై ఒత్తిడి తీసుకురావాలని రాయలసీమ జిల్లాలకు చెందిన టిడిపి నేతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

రాజధాని అంశాన్ని అస్త్రంగా చేసుకుని వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు రాయలసీమలో మరింత బలోపేతం కావడానికి ప్రయత్నాలు చేస్తోందని, దీన్ని అడ్డుకోవాలంటే కర్నూలులో రెండో రాజధాని ఏర్పాటు చేస్తూ ఏటా ఒక విడత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని టిడిపి నేతలు భావిస్తున్నారు. హైకోర్టు బెంచ్ కర్నూలు, తిరుపతి నగరాల్లో ఎక్కడ ఏర్పాటు చేసినా ఇబ్బంది ఉండదని వారంటున్నారు. జగన్ ప్రయత్నాలను తిప్పికొట్టడానికి అదంతా అవసరమని రాయలసీమకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు.

Rayalaseema gears up for second capital

కేంద్ర ప్రభుత్వం నిర్మించే దేశంలోని 100 స్మార్ట్ సిటీల్లో రాష్ట్రం నుంచి కర్నూలును ఎంపిక చేస్తామని గత ఆగస్టు 15వ తేదీన కర్నూలులో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతపురం జిల్లాలో రూ.1700 కోట్లతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, ఐటి హబ్ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. కడప జిల్లాలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో స్టీల్ ప్లాంట్, తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటిఆర్‌ఆర్, కుప్పంలో విమానాశ్రయం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కర్నూలు జిల్లాకు సంబంధించి సుమారు 15 పథకాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఏ ఒక్క దానికీ ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించలేదు.

ఈ నేపథ్యంలో రాజధాని నగరం ఎంపికపై ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. ప్రభుత్వం భావిస్తున్నట్లు విజయవాడ, గుంటూరు ప్రాంతాలు రాజధాని నగర నిర్మాణానికి అనుకూలంగా లేవని వెల్లడించిన కమిటీ ప్రకాశం జిల్లా దొనకొండ అనువైన ప్రాంతమని అభిప్రాయపడుతూ కర్నూలు కేంద్రంగా రాయలసీమ అభివృద్ధికి తగిన సూచనలు చేసింది. దీంతో కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకువచ్చి కనీసం రెండవ రాజధానిపై అధికారిక ప్రకటన చేయించాలని ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి ధృడసంకల్పంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు అనంతపురం, కడప జిల్లాలకు చెందిన పార్టీ నేతలు మద్దతుగా నిల్చినట్లు సమాచారం.

కర్నూలు జిల్లాలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను వినియోగించుకుని పలు రాష్ట్ర స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తూ నూతన భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని చంద్రబాబును కోరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాజధాని నగరం ఎక్కడ అనేదానిపై రానున్న 10, 15 రోజుల్లో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే అవకాశముందని పార్టీ నేతలు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+