మీతో పని లేదు, చెల్లదు: పీపీఏ రద్దుపై టి X ఎపి
హైదరాబాద్: పీపీఏల రద్దు విషయమై ఎవరి వాదన వారిదేగా ఉంది! ఒప్పందాలు రద్దు చేసుకునే అధికారం తమకు ఉందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పాదన సంస్థ (ఎపిజెన్కో)... ఎపి విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి లేఖ రాయగా, పీపీఏల రద్దు విషయంలో ఎపిజెన్కో వాదనను తెలంగాణలోని కేంద్రీయ విద్యుత్ పంపిణీ సంస్థ (సీపీడీసీఎల్) కొట్టి పారేస్తోంది.
ఈఆర్సీకి లేఖ రాయడం ద్వారా... విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) ఉపసంహరణ విషయంలో వెనక్కి తగ్గకూడదని ఏపీ సర్కారు పట్టుదలతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న మేరకు.. పీపీఏలు కుదుర్చుకున్న డిస్కంలు ఏపీ పరిధిలోనే ఉన్నాయని, ఈ చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలోని విద్యుత్ ఆ రాష్ట్రంలోనే వాడుకునే వీలుందని, పీపీఏ ప్రతిపాదనల సమయంలో డిస్కంల వారీగా విద్యుత్ వినియోగం ఎవరెవరికి ఎంతెంత అనే వాటాల గురించి ఎక్కడా ప్రస్తావించలేదని, ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్ ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్నందున ఈ డిస్కంలు చేసుకునే ఒప్పందాలతో తెలంగాణలోని డిస్కంలకు సంబంధం లేదని ఇంధన శాఖ అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రం విడిపోయాక ఆమోదం పొందని పీపీఏ ప్రతిపాదనలకు విలువేముంటుందంటున్నారు. ఆ ప్రతిపాదనలు రద్దు చేసుకుంటున్నట్లుగా నాలుగు డిస్కమ్లకు (తెలంగాణలో రెండు, ఎపిలో రెండు) సమాచారం అందించారు. ఇదే విషయాన్ని శనివారం మరోమారు ఏపీఈఆర్సీకి జెన్కో అధికారులు స్పష్టం చేశారు.
విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను ఉపసంహరించుకుంటున్నట్లుగా సమాచారం ఇస్తామే తప్ప.. ఈ విషయంలో మీ నిర్ణయంతో పని లేదని ఇంధన శాఖ తన లేఖలో ఈఆరీసీకి స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ ఆమోదం పొందని పీపీఏ ప్రతిపాదనలు ఏక్షణంలోనైనా రద్దు చేసుకునేందుకు తమకు పూర్తి అధికారం, హక్కు ఉన్నాయని తెలిపింది.
అలాగే రాష్ట్రంలో తీవ్ర విద్యుత కొరత ఉన్న నేపథ్యంలో ఈ అంశంపై కేంద్రంతో కాస్త కటువుగానే వ్యవహరించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఒప్పందాల విషయంలో పట్టుపట్టకుండా యథావిధిగా విద్యుత్ సరఫరా కొనసాగించాలని కేంద్రం కోరితే.. తమకు అదనంగా 1000 మెగావాట్ల కరెంటు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాలని నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్లపాటు పరిశ్రమలకు ప్రత్యేకంగా రాయితీలు కల్పించినా విద్యుత్ లేకుంటే కొత్త పరిశ్రమలొచ్చే అవకాశమే లేదని కరా ఖండిగా వివరించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఏపీఆర్సీ ఆమోదం పొందని పీపీఏలను రద్దు చేసి, కొత్త పీపీఏలను కుదుర్చుకునేందుకు ఏపీ పరిధిలోని రెండు డిస్కంలూ భావిస్తున్నాయి. దీనిపై 1-2 రోజుల్లోనే కీలకనిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నాయి.
అయితే, ఎపిజెన్కో వాదనను తెలంగాణలోని సీపీడీసీఎల్ కొట్టి పారేస్తోంది. పీపీఏలకు ఈఆర్సీ సమ్మతి లేదనే అంశాన్ని తోసిపుచ్చింది. ఎపి జెన్కో, డిస్కంల మధ్య ఒప్పందాలు కుదిరిన తర్వాతే ఈఆర్సీకి సమర్పించారని, వాటి ఆధారంగానే టారిఫ్ ఆర్డర్ జారీ అవుతూ వస్తోందని, అందువల్ల ఈఆర్సీ సమ్మతి ఇవ్వకపోయినా.. అది ఇచ్చినట్లుగానే పరిగణించాల్సి ఉంటుందని, ఉపసంహరణ సరికాదని తాజాగా ఎపి జెన్కోకు రాసిన లేఖలో సీపీడీసిఎల్ కోరినట్లు తెలుస్తోంది.