జనాలు ఎగబడుతున్నా.. ఓట్లు తేలేని సినీ తారలు!
ఎన్నికల ప్రచారంలో సినీ తారలు జోరుగా పాల్గొంటున్నా... ప్రజలకు మాత్రం మొహం మొత్తినట్లుగా కనిపిస్తోంది. ఓటర్లకు తారల ప్రచారంపై ఆసక్తి తగ్గిపోయినట్లుగా ఉంది. తారలు ప్రచారం చేస్తున్నా.. సినిమా తార అనే అభిమానంతో వచ్చి చూసే జనం తప్ప ఈ ప్రచార ప్రభావం ఓటర్లపై అంతగా పడే పరిస్థితి ఇప్పుడు లేదనే చెప్పవచ్చు.
శనివారం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో సినిమా నటులు చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, జయసుధ, జయప్రద, నారా రోహిత్, కృష్ణంరాజు, జీవిత వంటి తారలు వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు పార్టీల తరఫున ప్రచారం చేశారు. గతంలో తారలు టిడిపి కోసం ప్రచారం చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే 2004 తర్వాత ఈ ట్రెండ్ మారింది. ఏదో ఒక పార్టీకి పరిమితం కాకుండా అన్ని పార్టీల్లోనూ సినిమా తారలు కనిపిస్తున్నారు.
బిజెపి, టిడిపిల కోసం పవన్, కృష్ణం రాజు, బాలకృష్ణ, నారా రోహిత్ తదితరులు, కాంగ్రెసు కోసం చిరంజీవి, విజయశాంతి, జయసుధ, ఆర్ఎల్డీ కోసం జయప్రద, జై సమైక్యాంధ్ర తరఫున హేమలు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో కొందరు పోటీ చేస్తున్నందునం తమ నియోజకవర్గానికి పరిమితమయ్యారు. 2004 ఎన్నికల్లో దాదాపుగా తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం టిడిపి తరఫున చంద్రబాబు విజయానికి ప్రచారం చేసింది.
వాణిశ్రీ, ధర్మవరపు సుబ్రమణ్యం వంటి ఇద్దరు ముగ్గురు తారలను మినహాయిస్తే సినీ పరిశ్రమ మొత్తం బాబుకు అండగా నిలిచింది. అయినా టిడిపికి అధికారం దక్కలేదు. 2009లో జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణలు రాష్ట్రం మొత్తం ప్రచారం సాగించారు. అయినా టిడిపికి అధికారం దక్కలేదు. ఈసారి స్వయంగా బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేస్తున్నారు. ముస్లిం సిట్టింగ్ ఎమ్మెల్యేను తప్పించి బాలకృష్ణకు సీటు ఇచ్చారని ఆ వర్గంలో అసంతృప్తి కనిపిస్తోంది. దీంతో బాలకృష్ణకు గట్టిపోటీ తప్పడం లేదు.
కాంగ్రెస్ విజయం కోసం చిరంజీవి ఈరోజు రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ జోరుగా పర్యటిస్తున్నారు. బిజెపి, టిడిపి గెలుపు కోసం ఆయనతో పాటు జీవిత ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 30, 31న నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కలిసి సీమాంధ్రలో ప్రచారం చేయనున్నారు. సీనియర్ నటుడు కృష్ణంరాజు బిజెపి సీమాంధ్ర ప్రచార కమిటీ బాధ్యతలు నిర్వహిస్తూ ప్రచారం సాగిస్తున్నారు.
2004 ఎన్నికల్లోనే సినిమా తారల ప్రభావం ఎంతుంటుందో స్పష్టమైందని, 2009లో మరింత బాగా తెలిసొచ్చిందని అంటున్నారు. సినిమా తారలు జనాన్ని సభలకు రప్పించగలరేమో కానీ ఓట్లు వేయించలేరనే వాదన ఉండనే ఉంది. కాగా, ప్రముఖ నటి రమ్యశ్రీ శనివారం టిడిపిలో చేరారు. ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తానని, విజయానికి కృషి చేస్తానని చెప్పారు.