సవాళ్లు ఇవే: పళనిస్వామి నెగ్గుకొస్తారా?
మాజీ ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం పాలైనప్పటి నుంచి పట్టుదప్పిన పాలన, విధాన నిర్ణయాల అమలులో గందరగోళాన్ని సరిదిద్దడం తమిళనాడు నూతన ముఖ్యమంత్రి ఎడ్డపాడి కె పళనిస్వామి ముందున్న ప్రధాన సవాళ్లలో ఒకటి.
చెన్నై: మాజీ ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం పాలైనప్పటి నుంచి పట్టుదప్పిన పాలన, విధాన నిర్ణయాల అమలులో గందరగోళాన్ని సరిదిద్దడం తమిళనాడు నూతన ముఖ్యమంత్రి ఎడ్డపాడి కె పళనిస్వామి ముందున్న ప్రధాన సవాళ్లలో ఒకటి. సజావుగా పాలన సాగేందుకు ఆయన సరైన అధికారులను ఎంచుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు.
శనివారం రభస మధ్య అసెంబ్లీ విశ్వాస పరీక్షలో నెగ్గిన తమిళనాడు సీఎం పళనిస్వామి కొద్దికాలమే ఆ పదవిలో ఉంటారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వికె శశికళా నటరాజన్ తన సోదరి కొడుకు టీటీవీ దినకరన్ ను పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో తదుపరి సీఎం ఆయనేనన్నవదంతులను ఆ కుటుంబం వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తోంది.
వీటన్నింటికంటే తన సహచర ఎమ్మెల్యేలను ఎప్పటికప్పుడు సంతోషంగా ఉంటూ వారిని సంతోష పరుస్తూ ఉండాలి. రాజకీయంగా వారికి అనుకూల నిర్ణయాలు చేస్తూ, వారిని గౌరవించాల్సిన గురుతర బాధ్యత పళనిస్వామిపైనా, పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్పైనా ఉన్నది. ఆయన కలవరపడాల్సిన అంశం ఎమ్మెల్యే సంఖ్య.
ఎమ్మెల్యేలను కాపాడుకోవడం...
బలపరీక్షలో ఆయనకు అనుకూలంగా ఓటు వేసింది 122 మంది ఎమ్మెల్యేలు. అంటే మెజార్టీ కంటే ఆరుగురు ఎమ్మెల్యే ఎక్కవగా ఉన్నారు. అరడజను శాసనసభ్యుల్లో అసంతృప్తి చెలరేగితే పళని ప్రభుత్వానికి మూడినట్లే. అందుకే పార్టీలో ఏ ఒక్కరికి అసంతృప్తి లేకుండా అందరినీ బుజ్జగిస్తూ పరిపాలన సాగించడం పళనిస్వామి ముందున్న ప్రధాన సమస్య.
పేచీలు రానివ్వద్దు...
ఎమ్మెల్యేలు, నాయకులు పార్టీ ముందు సమానమని చెప్తున్న నాయకులు 30 ఏళ్ల సీనియారిటీ గల వారిని ఎలా గౌరవిస్తారా? అన్న విషయం చూడాల్సిందేనని ఓ ఎమ్మెల్యే చెప్పారు. అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే మధ్య తేడా చాలా స్వల్పమే కావడమేనని, తాము ప్రత్యర్థి గ్రూపులో చేరిపోతే ప్రభుత్వం పతనమవుతుందని, అది డీఎంకేకు లబ్ది చేకూరుతుందని ఓ ఎమ్మెల్యే తెలిపారు.
చెన్నైకి చిన్నమ్మ తరలింపు కూడా.
శశికళను బెంగుళూరు జైలు నుంచి చెన్నె జైలుకు రప్పించడం ఆయన అజెండాలో అగ్రస్థానంలో ఉంది. సవాళ్లను ఎదుర్కొంటూ సమస్యలను పరిష్కరించడం పళనిస్వామికి సాధ్యమేనా? కాలం కలిసోచ్చి ముఖ్యమంత్రి సీటు దక్కింది. కానీ సీఎం సీటులో కూర్చున్న ఆయన రిమోట్ మాత్రం శశికళ చేతిలో ఉందనేది బహిరంగ రహస్యం. ఒకవేళ శశికళ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తే పరిస్థితి భిన్నంగా ఉండేదని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు. కానీ అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష పడిన శశికళ స్థానే త్వరలో జరిగే ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి పార్టీ తరఫున టీటీవీ దినకరన్ అభ్యర్థిగా బరిలో నిలుస్తారని తెలుస్తున్నది. ఈ ఉప ఎన్నికలో దినకరన్ ను గెలిపించాల్సిన బాధ్యత కూడా నూతన సీఎం పళనిస్వామి భుజస్కందాలపైనే ఉంది.
పాలనపై దృష్టి సారించాల్సిందే..
కొన్ని నెలలుగా పూర్తిగా పట్టుదప్పిన ప్రభుత్వ యంత్రాంగాన్ని గాడిలో పెట్టడం పళనిస్వామికి కత్తిమీద సాము వంటిదే. పాలనలో సరైన సహాయ సహకారాన్ని అందించే టీమ్ను ఎంచుకోవడం కూడా ఒక సమస్యే. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాదన్ పూర్తిగా మెరుగైన అధికారిగా ఉన్నారు. సీఎం అడ్వైజర్గా పనిచేసిన షీలా బాలక్రుష్ణన్ సహా పలువురు సీనియర్ బ్యూరోక్రాట్లు జయలలిత హయాంలో ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన అధికారులు తర్వాత కాలంలో దూరమయ్యారు. వారిలో ఆసక్తిగల వారిని వెనక్కు రప్పించుకునేందుకు సీఎం పళనిస్వామి వ్యూహాత్మకంగా ముందడుగు వేయాల్సి ఉంటుంది.
పెండింగులో ఫైళ్లు...
వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన 1000 అత్యసరమైన ఫైళ్లలో 400లకు పైగా కీలక ఫైళ్లు సీఎం కార్యాలయంలో పెండింగ్లో ఉన్నాయి. శాంతిభద్రతల పరిరక్షణతోపాటు నిఘా విభాగానికి చెందిన పలు కీలక పోస్టుల నియమాకంతోపాటు వివిధ శాఖల్లో పదోన్నతుల కల్పన పెండింగ్ లో ఉంది. ఇటువంటి సమస్యలన్నీ కొత్త సీఎంగా పరిష్కరించాల్సిన బాధ్యతలు ఉన్నాయి. 2013 నుంచి ఇప్పటివరకు సజావుగా పాలన సాగించేందుకు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల సదస్సులు నిర్వహించిన దాఖలాలు లేవు. పరిపాలనా సంక్షోభానికి తోడు తాగునీరు, పంటల సాగుకు అవసరమైన నీటి సరఫరా పళనిస్వామి ముందున్న మరో సవాల్.