కుట్రనా: బ్రాహ్మనిజం సినిమాకి విదేశీ నిధులు!
తాజాగా మంగళవారం బిజెపి సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి నల్లు ఇంద్రసేనా రెడ్డి మాట్లాడుతూ.. బ్రాహ్మణుల్ని కించపర్చాలన్న కుట్రతోనే ఏ ఉమన్ ఇన్ బ్రాహ్మణిజం సినిమా తీశారని, ఈ సినిమా తీయడానికి విదేశాల నుండి డబ్బులు వచ్చినట్లుగా తమ దృష్టికి వచ్చిందని ఆయన ఆరోపించారు. ఒంగోలుకు చెందిన వ్యక్తి తీసిన ఈ చిత్రానికి ఏయే దేశాల నుంచి ఎంతెంత నిధులు వచ్చాయి, ఎలా వచ్చాయన్న అంశంపై ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
సినిమా పూర్తిగా బ్రాహ్మణ వర్గాన్ని టార్గెట్ చేసుకున్నదనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇది ఖచ్చితంగా కుట్రేననే అభిప్రాయం ఇతరులలో కూడా వ్యక్తమవుతోంది. కాగా తీవ్ర వివాదాస్పదం కావడంతో ‘ఎ ఉమన్ ఇన్ బ్రాహ్మణిజం' చిత్రాన్ని నిలిపివేయాని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బ్రాహ్మణ స్త్రీలను కించ పరిచేలా ఉండటంతో బ్రాహ్మణ సంఘాలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం, ఇతరత్రా వర్గాల నుంచి విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
చలం వంటి గొప్ప వ్యక్తి రాసిన పుస్తకం పేరును అడ్డుపెట్టుకుని, బ్రాహ్మణ స్త్రీలను కించపరిచేలా సినిమాలు తీయడం పట్ల బ్రాహ్మణ సంఘాలు మండిపడ్డాయి. ఈ పరిణామాల నేపథ్యంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి మేనేజింగ్ డైరెక్టర్ చంద్రవదన శుక్రవారం రాష్ట్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. సినిమాటోగ్రఫీ చట్టం కింద ఈ చిత్ర ప్రదర్శన ను నిలిపివేయాలని కోరారు.
ఈ చిత్రాన్ని రాష్ట్రంలో విడుదల కాకుండా రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ తదితరులు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి డికె అరుణకు వినతిపత్రాన్ని సమర్పించారు. అధికారులు కూడా సినిమాపై అభ్యంతరం చెప్పడంతో మంత్రి అరుణ సినిమా విడుదల నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు.