ఆశలు వదులుకోని గల్లా జయదేవ్

ఇటీవల జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో తన కుటుంబం కాంగ్రెస్ పార్టీకోసం పనిచేసిందో లేదో ప్రజలకే తెలుసునని ఆయన అన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన తన కుటుంబానికి వెన్నుపోటు పొడిచే సంస్కృతి లేదని ఆయన అన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటినుంచే క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామన్నారు .ఒకే కుటుంబం నుంచి ఇద్దరూ పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు ఈ విషయాన్ని తన తల్లినే అడగాలని సూచించారు.
రాజ్యసభకు ఎన్నిక కావడం ద్వారా చిరంజీవి రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన తిరుపతి నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి గల్లా జయదేవ్ తీవ్రంగానే ప్రయత్నాలు చేశారు. ఆయన తల్లి గల్లా అరుణ కుమారి కూడా తన ప్రయత్నాలు ముమ్మరంగా సాగించారు. అయితే, తానొకటి తలిస్తే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోటి తలిచారు. ఆ సీటును వెంకటరమణకు ఇచ్చారు. దాంతో గల్లా అరుణ కుమారి తీవ్ర అసంతృప్తికి గురైనట్లు చెబుతారు.
కాంగ్రెసు అభ్యర్థి వెంకటరమణకు గల్లా అరుణ కుమారి సహకరించలేదని అంటారు. వెంకటరమణ ఓటమికి అది కూడా ఓ కారణమనే అభిప్రాయం ఉంది. అందుకే - తమ కుటుంబానికి వెన్నుపోటు పొడిచే సంస్కృతి లేదని గల్లా జయదేవ్ అన్నట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏమైనా, తిరుపతి సీటుపై గల్లా జయదేవ్ తన ఆశలను వదులుకోనట్లే కనిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications