తెలంగాణ: వైయస్ జగన్ లెక్కలు
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని సీట్లపై, నల్లగొండ, మహబూబ్ నగర్ వంటి దక్షిణ తెలంగాణలోని సీట్లను ఆయన తన ఖాతాలో వేసుకున్నట్లు చెబుతున్నారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి 2009 ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే ఆయన అనుసరించబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో సాధించిన సీట్ల ద్వారానే వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చారు. తెలంగాణవాదం బలహీనంగా ఉన్న నియోజకవర్గాలను జగన్ గుర్తించినట్లు చెబుతున్నారు.
తన వ్యూహానికి అనుగుణంగా సీమాంధ్రలో తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలను పూర్తిగా తుడిచిపెట్టేందుకు వీలుగా ఆయన రాజకీయ వ్యూహాన్ని రూపొందించుకుని అమలు చేస్తున్నారు. ఇరు పార్టీల నుంచి వలసలను ఆయన ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణలో కూడా ఆయన కొద్ది మంది బలమైన నాయకులున్నారు. జీవన్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి వంటి నాయకులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా, కొండా సురేఖ, కెకె మహేందర్ రెడ్డి, కొమ్మూరి ప్రతాప రెడ్డి వంటి నాయకులు ఇప్పటికే పార్టీలో ఉన్నారు. తెలంగాణవాదం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా తెరాసను ఎదుర్కోవడానికి సరిపడే నాయకులు చాలా నియోజకవర్గాల్లో ఉన్నట్లు చెబుతున్నారు.
వైయస్ జగన్ వ్యూహాన్ని పసిగట్టిన తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తెలుగుదేశం పార్టీకి దగ్గర కావడానికి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. 2009లో సీట్ల పంపకంలో జరిగిన పొరపాట్లు ఈసారి జరగకుండా చూసుకుంటూ కాంగ్రెసు గెలిచిన స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచే విధంగా వ్యూహాన్ని రచించి అమలు చేయాలని ఆయన ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. సిపిఐ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని తెరాసతో పొత్తు కట్టడానికి సిద్ధపడగా, ఆ పార్టీ సహాయంతో తెలుగుదేశం పార్టీ తెరాసకు దగ్గర కావచ్చునని అంటున్నారు. దీంతో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను ఎదుర్కోవడానికి తగిన వ్యూహాన్ని అనుసరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.