చిరంజీవికి పర్యాటక శాఖ: గిరాకీ కోసమేనా?
నిన్న ప్రధానితో భేటీ అయ్యారు. దీంతో వారం రోజుల్లో కేంద్రమంత్రివర్గ విస్తరణ జరుగుతుందని జోరుగా ఊహాగానాలు వస్తున్నాయి. గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాహుల్ గాంధీని కేబినెట్లోకి తీసుకునేందుకు, ఖాళీగా ఉన్న వాటిని ఫుల్ ఫిల్ చేసేందుకు, గుజరాత్ రాష్ట్రానికి పెద్ద పీఠ వేసేందుకు సాధ్యమైనంత త్వరగా ఈ విస్తరణ జరిగే అవకాశముంది. ఇది ఈ వారం రోజుల్లోనే జరగనుందని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టుల భర్తీకి, మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు అనుమతించిన అధిష్టానం కొంతకాలం ఆగాలని సూచించినట్లుగా తెలుస్తోంది. ఇందుకు కేంద్రమంత్రివర్గ విస్తరణే కారణమని సమాచారం. మన రాష్ట్రానికి కూడా పెద్ద పీఠ వేసేందుకు కిరణ్ కుమార్ రెడ్డితో ఢిల్లీ నేతలు ఆయనతో చర్చించారు. చిరంజీవితో పాటు మరో ఇద్దరి ముగ్గురు పేర్లు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
చిరంజీవిని కేబినెట్లోకి తీసుకొని పర్యాటక శాఖ ఇవ్వాలని భావిస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం కేంద్ర పర్యాటక మంత్రిగా ఉన్న సుబోధ్కాంత్ సహాయ్ స్థానంలో ఆయనకు ఈ శాఖ కేటాయించాలని అధిష్ఠానం భావిస్తోందట. కోల్గేట్ కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు వచ్చిన సహాయ్ని మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలున్నాయి. ఈ శాఖను చిరంజీవికి స్వతంత్ర హోదాతో నిర్వహించేందుకు అవకాశం కల్పించాలని అధిష్ఠానం యోచిస్తోందట.
చిరంజీవి సినిమా రంగం నుండి వచ్చిన నాయకుడు. ఆయనకు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాకుండా దక్షిణాదిన, ఉత్తరాదిన కూడా పేరు ఉంది. సినిమా రంగానికి చెందిన వ్యక్తి కాబట్టి చిరంజీవికి పర్యాటక శాఖ ఇస్తే బావుంటుందని భావిస్తున్నారని తెలుస్తోంది. ఆయన వల్ల పర్యాటక రంగం దేశంలో మరింత వృద్ధి సాధిస్తుందని భావిస్తున్నందు వల్లే కాంగ్రెసు పెద్దలు ఆయనకు టూరిజం శాఖను ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారట. కాగా గతంలో చిరుకు షిప్పింగ్ ఇస్తారనే వార్తలు కూడా వచ్చిన విషయం తెలిసిందే.