భానుమతి జగన్కు జై కొడతారా!?
అనంతపురం జిల్లాలో పరిటాల శ్రీరాములు ముఖ్య నేత. ఆయన తెలుగుదేశం పార్టీలో ముఖ్య లీడర్గా ఎదిగి, మంత్రిగానూ పని చేశాడు. ఆ కుటుంబమంటే పడని మద్దెలచెర్వు సూరి కుటుంబం కాంగ్రెసులో తొలి నుండి ఉంటోంది. పరిటాల హత్య తర్వాత సూరి అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఇలా పలు సందర్భాలలో సూరి సతీమణి భానుమతి కాంగ్రెసు బలోపేతం కోసం ఆందోళన కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండేవారు.
ఆమె 2004, 2009 సాధారణ ఎన్నికలలో పార్టీ టిక్కెట్ను ఆశించారు. కానీ ఆమెకు మాత్రం పార్టీ మొండి చేయి ఇచ్చింది. పరిటాల కుటుంబానికి ధీటుగా ఎదుర్కోవాలంటే రాజకీయాలలో ఎదగటం తప్పనిసరి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెసు తమకు రెండుసార్లు టిక్కెట్ కేటాయించక పోవడంపై భానుమతి అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు.
అయితే ఇన్నాళ్లు టిడిపి, కాంగ్రెసు మాత్రమే ఉండటంతో గంగుల వారి అసంతృప్తి బయటకు కనిపించలేదని, ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పుట్టుకు రావడంతో తనకు ప్రాధాన్యత ఇవ్వని పక్షంలో ఆమె జగన్ పార్టీకి జై కొట్టవచ్చునని అంటున్నారు. అయితే ఆమె ఇప్పటి వరకు ఎక్కడా కాంగ్రెసు పార్టీ పట్ల తన అసంతృప్తిని ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఆమె 2014 వరకు వేచి చూసి అప్పుడు కూడా టిక్కెట్ రాకుంటే బయటకు రావచ్చునని అంటున్నారు.