విభజన: జూనియర్ ఎన్టీఆర్ అటా, ఇటా?
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై తన తండ్రి నందమూరి హరికృష్ణ తీవ్రంగా ప్రతిస్పందిస్తున్న నేపథ్యంలో ఆయన కుమారుడు, సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ మౌనం దాల్చాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెసు అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై ఆయన పెదవి విప్పడం లేదు. రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న జూనియర్ ఎన్టీఆర్ విభజనపై మాట్లాడకపోవడంపై తీవ్రమైన చర్చే సాగుతోంది.
హైదరాబాదులో పుట్టి పెరిగిన జూనియర్ ఎన్టీఆర్ ఎటు వైపు ఉంటాడనే విషయంపైనే ఎక్కువగా చర్చ సాగుతోంది. తాత ఎన్టీ రామారావు వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కృష్ణా జిల్లాపై, విజయవాడపై ఎనలేని మక్కువను ప్రదర్శించిన సందర్భాలున్నాయి. విజయవాడుకు వస్తే సొంత ఊరికి వచ్చినట్లుగా ఉంటందని వ్యాఖ్యానించిన సందర్భం కూడా ఉంది.

ఆయన హైదరాబాదులో పుట్టి పెరిగినప్పటికీ రాజకీయాలకు కృష్ణా జిల్లానే కేంద్రంగా చేసుకుంటారనేది మొదటి నుంచీ వినిపిస్తున్న మాటే. నందమూరి కుటుంబ సభ్యులకు కృష్ణా జిల్లాపై ఎనలేని ప్రేమ. జూనియర్ ఎన్టీఆర్కు కూడా అంతే. అక్కడి ప్రజలు కూడా జూనయర్ ఎన్టీఆర్ను తమవాడిగానే చూస్తారు.
జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి కూడా దూరమైనట్లేనని భావిస్తున్నారు. దీంతో ఆయన రాజకీయాల గురించి మాట్లాడడం లేదు. సినిమాలతో ఆయన తీరిక లేకుండా ఉన్నారు. అందువల్ల రాష్ట్ర విభజనపై ఆయన మాట్లాడాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications