అసెంబ్లీకి టీ తీర్మానం నో: తేల్చేసిన రాష్ట్రపతి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తీర్మానాన్ని శాసనసభకు పంపాల్సిన అవసరం లేదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తేల్చేసినట్లు ప్రచారం సాగుతోంది. కొత్త రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన తీర్మానాన్ని శాసనసభకు పంపించాలనే సంప్రదాయాన్ని ఆయన తెలంగాణ విషయంలో పాటించకపోవచ్చునని అంటున్నారు. ఎన్డీయె ప్రభుత్వ హయాంలో తీర్మానాలను కూడా శాసనసభలకు పంపించారు. కానీ, అందుకు విరుద్ధంగానే ప్రణబ్ ముఖర్జీ వ్యవహరించే అవకాశాలున్నాయని అంటున్నారు.
అభిప్రాయం కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును మాత్రమే శాసనసభకు పంపించాలని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం తీర్మానాన్ని అసెంబ్లీకి పంపించాల్సిన అవసరం రాష్ట్రపతికి లేదు. బిల్లును అసెంబ్లీ ఆమోదించాలని అడిగే అవసరం లేదు. రాష్ట్రపతి ఆమోదం తీసుకున్న తర్వాతనే తెలంగాణ బిల్లును కేంద్ర మంత్రివర్గం పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.

కేంద్ర మంత్రి వర్గం తనకు పంపించే తెలంగాణ బిల్లు ముసాయిదాపై అభిప్రాయాన్ని అడుగుతూ రాష్ట్రపతి దాన్ని రాష్ట్ర శాసనసభకు పంపిస్తారు. దానికి గడువు కూడా విధిస్తారు. గడువులోగా శాసనసభ తన అభిప్రాయాన్ని పంపించాల్సి ఉంటుంది. గడువులోగా రాకపోతే దాంతో ప్రమేయం లేకుండానే రాష్ట్రపతి బిల్లును పార్లమెంటులో ప్రతిపాదించడానికి అనుమతి ఇవ్వవచ్చు.
ఈ స్థితిలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఎన్డీఎ పెట్టిన సంప్రదాయాన్ని పక్కన పెట్టేసి రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వ్యవహరించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇటీవలి హైదరాబాద్ పర్యటనలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాజభవన్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ నర్సింహన్తో గంటపాటు చర్చించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications