జగన్కు సబ్బం హరి దూరం అవుతారా?
తమ ప్రాంత ప్రజల నుంచి ఒత్తిడి రావడంతో రాష్ట్ర విభజన విషయంలో జగన్ ఆదేశాలతో నిమిత్తం లేకుండా ముందుకు సాగుతానని చెప్పారు. ఇంత కాలం జగన్ కోసం రాష్ట్ర విభజనపై నోరు మెదపలేదని, ఇక జగన్ ఆదేశాల కోసం నిరీక్షించబోమని, సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకుని పోతానని ఆయన అన్నారు. ఈ మాటలే ఆయన జగన్కు దూరమవుతారా అనే సందేహానికి కారణమవుతోంది.
అరెస్టుకు ముందు జగన్ ఓదార్పు యాత్రలో ఆయన పాల్గొన్నారు. జగన్ అరెస్టు సమయంలో వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అండగా నిలిచారు. రాష్ట్ర విభజన వ్యవహారంపై ఆయన కాంగ్రెసు పార్టీని దుమ్మెత్తిపోశారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్లపై విరుచుకుపడ్డారు.
ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాన్ని విభజించడం ప్రమాదకరమని ఆయన అన్నారు. ఇంతకు ముందు హోం శాఖను నిర్వహించిన కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరంపై కూడా ఆయన నిప్పులు చెరిగారు. జగన్ను కాదని సబ్బం హరి ఎటు పోతారనేది ప్రశ్న.