తాత జ్ఞాపకాలతో జానకిరాం, 'ఎన్టీఆర్' ఫ్యామిలీకి భిన్నంగా పారిశ్రామికవేత్తగా..!
హైదరాబాద్: జానకిరాం నిత్యం తన తాత స్వర్గీయ నందమూరి తారక రామారావు స్మృతులతోనే ఉండేవారట. తాతపై తనకున్న ప్రేమను నిదర్శనంగా తన కుమారుడికి నందమూరి తారక రామారావు అని పేరు పెట్టుకున్నారు. తాతతో తన స్మృతులను నెమరువేసుకునే క్రమంలో జానకిరాం తన ఫేస్బుక్ను తాతతో తను దిగిన ఫోటోలతో నింపుకున్నారు.
ఎన్టీఆర్కు సంబంధించిన కార్టూన్లు, ఫొటోలను కూడా జానకిరాం భద్రంగా దాచుకున్నారంటున్నారు. 1977లో ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన చాణక్య చంద్రగుప్త సినిమా షూటింగ్ సమయంలో అక్కినేని నాగేశ్వర రావు చిన్నారి జానకిరాంను ఎత్తుకున్నారు. చిన్నతనంలో ఏఎన్ఆర్, ఎన్టీఆర్లతో కలిసి ఫోటో దిగడం అదృష్టంగా భావిస్తున్నానని ఫేస్బుక్లో రాసుకున్నారు.
కాగా, జానకిరాం పేరెన్నికగన్న పారిశ్రామికవేత్తగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్ కుటుంబం మొత్తం సినిమాలు, రాజకీయాల చుట్టూ తిరిగితే జానకిరాం మాత్రం పారిశ్రామిక రంగం వైపు అడుగులేశారని ఆయన చెప్పారు. హరికృష్ణ కుటుంబ సభ్యులను కొడాలి నాని ఓదార్చారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జానకిరాంతో తన పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు. సినీ, రాజకీయ నేపథ్యం ఉన్నా జానకిరాం ఏనాడు ఆర్భాటాలకు పోలేదన్నారు. అంతేకాక వంశపారంపర్యంగా అందివచ్చిన ఆస్తులపై ఆధారపడని జానకిరాం అమెరికాలో పదేళ్ల పాటు పని చేసి బాగానే డబ్బు ఆర్జించారన్నారు.
ఆ డబ్బుతోనే కాకినాడలో కోవలెంట్ పరిశ్రమను నెలకొల్పుతున్నారన్నారు. మరో నెల రోజుల్లో సదరు కంపెనీ ప్రారంభం కానున్న నేపథ్యంలో జానకిరాం అస్తమయం తనను కలచివేసిందన్నారు. మరింతకాలం బతికి ఉంటే జానకిరాం విజయవంతమైన పారిశ్రామికవేత్తగా ఎదిగేవారన్నారు.