తెలంగాణ కుటుంబ సర్వే: ఇంట్లో లేని లగడపాటి
హైదరాబాద్: తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వేలో విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పాల్గొనలేకపోయారు. లగడపాటి రాజగోపాల్ ఇంట్లో లేకపోవడంతో ఎన్యుమరేటర్లు వివరాలు నమోదు చేసుకోకుండానే వెనుదిరిగారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం మంగళవారంనాడు ఒక రోజు సర్వేను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
హైదరాబాదులోని కుందన్బాగ్ ఆఫీసర్స్ కాలనీలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తన వివరాలు నమోదు చేయించుకున్నారు. అలాగే జిహెచ్ఎంసి కమిషనర్ సోమేష్ కుమార్ రాజేంద్రనగర్లో ఎన్యుమరేటర్లకు వివరాలు ఇచ్చారు.
సమగ్ర సర్వే దరఖాస్తులో అప్పులు నమోదు చేసే కాలమ్ ఎందుకు లేదని తెలుగుదేశం మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు మల్లారెడ్డి అధికారులను ప్రశ్నించారు. మంగళవారం ఉదయం మల్లారెడ్డి ఇంటికి వచ్చిన ఎన్యుమరేటర్లు ఆయన కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేశారు.
సామాన్యుల అప్పులను తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. ప్రముఖుల ఇల్లలోని వివరాలను కూడా ఎన్యుమరేటర్లు సేకరిస్తున్నారు. తొలుత మందకొడిగా ప్రారంభమైన సర్వే తర్వాత ఊపందుకుంది.