చౌకబారు పబ్లిసిటీ వద్దంటున్న ప్రీతీ జింతా
ముంబై: మాజీ ప్రియుడు నెస్ వాడియా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ చేసిన వ్యాఖ్యలతో తలెత్తిన దుమారానికి బాలీవుడ్ నటి ప్రీతీ జింతా అంతం పలికినట్లు కనిపిస్తున్నారు. మే 30వ తేదీన తన పట్ల నెస్ వాడియా అసభ్యంగా ప్రవర్తించాడని, చేయి చేసుకున్నారని నెస్ వాడియాపై ఆమె ఫిర్యాదు చేసింది.
తాను ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వెనక గల కారణాలను వివరిస్తూ ప్రీతీ జింతా సోషల్ మీడియా పేజ్లో సంక్షిప్తమైన నోట్ పోస్టు చేసింది. ఇది వ్యక్తిగతమైంది కాదనీ, చవకబారు ప్రచారం కోసం తాను దీన్ని ఉద్దేశించలేదని ఆమె స్పష్టం చేశారు. డబ్బులు చేసుకోవాలనే ఉద్దేశం కూడా అందులో లేదని ఆమె అన్నారు.
గత కొద్ది రోజులుగా ప్రజల నుంచి, మీడియా నుంచి, మిత్రుల నుంచి కొన్ని ప్రతిస్పందనలు వస్తున్నాయని, జీవితం ఎప్పుడూ నలుపూ తెలుపూ కాదని, కొన్ని పరిమితిలుంటాయని ఆమె అన్నారు. తనకు మద్దతుగా నిలిచినవారికి ఆమె ధన్యవాదాలు తెలుపుతూనే కొన్ని ప్రతిస్పందనలు తనకు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయని అన్నారు.
తన ఎఫ్ఐఆర్ చాలా స్పష్టంగా ఉందని, ఊహాగానాలకు తావు లేదని ఆమె అన్నారు. తనకు ఇతర ఉద్దేశ్యాలు ఏమీ లేవని, విషయాన్ని నిటారుగా, స్పష్టంగా పెట్టడమే తన ఉద్దేశమని ఆమె చెప్పారు. వ్యక్తిగతమైన సంబంధాన్ని తాను పోలీసులకు ఎందుకు చెప్పాలని అన్నారు. సంబంధం 2009లో ముగిసిందని, దానిపై తాను ఎప్పుడూ పోలీసులకు వద్దకు వెళ్లలేదని చెప్పారు.