చంద్రబాబు పురంధేశ్వరికి పచ్చజెండా, కానీ..
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మాజీ కేంద్ర దగ్గుబాటి పురంధేశ్వరి బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. అయితే, ఆమె తెలుగుదేశం పార్టీలో చేరాలని ఉవ్విళ్లూరారట. అందుకు చంద్రబాబు చెంతకు రాయబారిని కూడా పంపినట్లు తెలుస్తోంది. చంద్రబాబు పురంధేశ్వరిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటామని చెప్పారట. కానీ, ఆమె భర్త, తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు మాత్రం ప్రవేశం ఉండదని కచ్చితంగా చెప్పారట.
దగ్గుబాటి వెంకటేశ్వర రావు పట్ల చంద్రబాబుకు ఉన్న వ్యతిరేకతతో తెలుగుదేశం పార్టీలో చేరడానికి పురంధేశ్వరి ఇష్టపడలేదని అంటున్నారు. చివరికి ఆమె బిజెపిని ఎన్నుకున్నారని చెబుతున్నారు. బిజెపి అభ్యర్థిగా ఆమె విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఇది కూడా పురంధేశ్వరికి సమస్యగా మారుతుందా అనే అనుమానాలు పొడసూపుతున్నాయి.

బిజెపితో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొత్తు ఖరారైతే విశాఖపట్నం సీటు తమ పార్టీకే కావాలని చంద్రబాబు పట్టుబడితే పురంధేశ్వరికి కష్టాలు తప్పకపోవచ్చు. విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి మాజీ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావును పోటీకి దించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
గంటా శ్రీనివాస రావు గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండేవారు. ఆయన చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనం కావడంతో ఆయన కూడా ఆ పార్టీలోకి వచ్చారు. రాష్ట్ర మంత్రి పదవి చేపట్టారు. ఇప్పుడు కాంగ్రెసుకు రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు.












Click it and Unblock the Notifications