ఎపి రాజధాని: జగన్ తిరకాసు ఎందుకు?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తామని, విజయవాడ - గుంటూరు ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేసినా ఫరవాలేదనే పద్ధతిలో మాట్లాడుతూ వచ్చిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు ఎందుకు తిరకాసు పెడుతున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. శాసనసభలో చర్చించిన తర్వాతనే రాజధాని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటన చేయాలని పట్టుబడుతూ బుధవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బుధవారం శానససభా కార్యక్రమాలను అడ్డుకుంది.
30 - 35 వేల ఎకరాలు ఉన్న ప్రాంతంలో ఎక్కడైనా రాజధాని ఏర్పాటు చేయవచ్చునని వైయస్సార్ కాంగ్రెసు చెబుతూ వచ్చింది. అకస్మాత్తుగా 50వేల ఎకరాలు ఉన్న చోటనే రాజధానిని ఏర్పాటు చేయాలని ఇప్పుడు వాదిస్తోంది. దొనకొండ ప్రాంతంలో ప్రభుత్వం భూమి చాలా ఖాళీగా ఉందని అంటన్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి జగన్ పూనుకన్నట్లు అర్థమవుతోంది.
అదే సమయంలో విజయవాడకు సమీపంలో రాజధానిని ఏర్పాటు చేసుకోవాలనే చంద్రబాబు నిర్ణయం పట్ల కొంత మంది మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కూడా. కర్నూలు జిల్లాలో చాలా ఖాళీ భూములు అందుబాటులో ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి ఇటీవల అన్నారు. మరోవైపు, కర్నాలును రాజధానిగా చేయాలని రాయలసీమలో ఆందోళన పెరుగుతూ వస్తోంది.
విద్యార్థులు మంగళవారంనాడు విద్యాసంస్థల బంద్ పాటించారు. రాయలసీమలో ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో వ్యూహాత్మకంగా జగన్ చంద్రబాబును ఇరాకటంలో పెట్టడానికి రాజధానిపై మరో వాదనతో ముందుకు వస్తున్నారని అంటున్నారు. ఏమైనా, చంద్రబాబుపై రాజకీయ దాడికి జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.