ఫొటోలు: సచిన్, ధోనీ, యువీలపైనా అనుమానమా?
న్యూఢిల్లీ: బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ అనుమానిత బుకీ కరణ్ గిల్హోత్రాతో ఫొటో దిగడంపై పెద్ద వివాదమే చెలరేగింది. ఓ అనుమానిత బుకీతో బీసీసీఐ కార్యదర్శికి పనేమిటని, ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని బీసీసీఐకి ఐసీసీ లేఖ రాసింది.
అనురాగ్ విషయంలో సందేహాన్ని వ్యక్తం చేసిన ఐసీసీ సచిన్, ధోనీ, యువీలపైనా ఇదే తీరుగా స్పందిస్తుందా అనేది ఆసక్తిగా మారింది. సల్మాన్ ఖాన్ లాంటి సెలెబ్రిటీస్తోనూ గిల్హోత్రా కలిసి దిగిన ఫొటోలున్నాయి. గిల్హోత్రాకు సెలెబ్రిటీస్తో పరిచయాలు పెంచుకోవడం, వారితో కలిసి తిరగడం, ఫొటోలు దిగడం అంటే మహా సరదా అట.
2009 దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ఐపీఎల్లో ఆ లీగ్ లోగో ఉన్న ఓ ఐడీ కార్డు మెడలో వేసుకుని ధోనీతో దిగిన ఫొటో కూ డా ఉంది. దీనిపై స్పందించిన గిల్హోత్రా, ఆ కార్డు తాను దొంగిలించింది కాదని, ఓ హోదాతో ఆ లీగ్కు హాజరయ్యానని చెప్పాడు. ఆ హోదా ఏమిటో సరిగా గుర్తుకురావడం లేదని చెప్పాడు.
ఐసిసి అనుమానాలపై అనురాగ్ ధాటిగానే కౌంటర్ ఇచ్చాడు. దీని వెనుక ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్ హస్తముందని, తానంటే గిట్టకే ఈ వివాదానికి తెరతీస్తున్నాడని ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
కాగా, ఇదే అనుమానిత బుకీ కరణ్ గిల్హోత్రా గతంలో యువరాజ్ సింగ్, ధోనీ, సచిన్ టెండూల్కర్లతో పాటు మరికొందరు క్రికెటర్లతో కలిసి ఉన్న ఫొటోలు ఇప్పుడు బయటికొచ్చాయి.