వదిన మృతి: కెసిఆర్ పుష్కర స్నానంపై వివాదం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న గోదావరి పుష్కరాల్లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నదీ స్నానం ఆచరించడం వివాదంగా మారింది. కెసిఆర్ వదిన కల్వకుంట్ల సుభద్ర గత శనివారం మరణించిన నేపథ్యంలో ఆయన పుష్కర స్నానం చేయకూడదని కొందరు పండితులు చెబుతుండగా.. సొంత వదిన కాకపోవటం వల్ల దోషం ఏమీ ఉండదని మరికొందరు పండితులు పేర్కొన్నారు.
అయితే మంగళవారం నుంచి ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాల్లో నదీ స్నానం ఆచరించటానికి సీఎం కేసీఆర్ సోమవారం సాయంత్రమే కరీంనగర్ జిల్లా ధర్మపురి క్షేత్రానికి వెళ్లారు. సీఎం కేసీఆర్ సన్నిహితులు అందించిన సమాచారం ప్రకారం.. కేసీఆర్ తోబుట్టువుల్లో తొమ్మిదిమంది అక్కాచెల్లెళ్లు, ఒక సోదరుడు ఉన్నారు. కేసీఆర్ తండ్రి పేరు రాఘవరావు.
రాఘవరావు దంపతులకు తొలుత వరుసగా ఆడపిల్లలు జన్మించడంతో తమ సమీప బంధువు.. కల్వకుంట్ల వంశానికే చెందిన సోదరుడి కుమారుడు వెంకట్రావును పెంచుకున్నారు. ఆయనను పెంపకానికి తీసుకున్న తర్వాత రాఘవరావు దంపతులకు ఇద్దరు మగ పిల్లలు పుట్టారు. వారిలో కేసీఆర్ ఒకరు.
కాగా, కల్వకుంట్ల వెంకట్రావు భార్య సుభద్ర మెదక్ జిల్లాలో శనివారం మరణించారు. ఈ నేపథ్యంలో సొంత ఇంటి పేరున్న వదిన చనిపోయి మూడు రోజులు గడవకముందే సీఎం కేసీఆర్ పుష్కర స్నానం చేయడం ఆయనకు వ్యక్తిగతంగానే కాకుండా, తెలంగాణ రాష్ట్రానికి కూడా అరిష్టమని కొందరు పండితులు అంటున్నారు.
సాధారణంగా సొంత ఇంటి పేరు కలిగిన వారు.. పాలెవారు చనిపోతే కుటుంబ సభ్యులు, బంధువులకు కనిష్ఠంగా 12 రోజుల నుంచి మూడు నెలలపాటు మైల(ముట్టు)గా పరిగణిస్తారని చెబుతున్నారు. మరి కొంతమంది పండితులు మాత్రం భిన్న వాదన వినిపిస్తున్నారు.
చనిపోయిన కల్వకుంట్ల సుభద్ర సీఎం కేసీఆర్కు సొంత వదిన కాదని, సుభద్ర అంత్యక్రియలతోపాటు, కర్మకాండలన్నింటినీ పూర్తి చేసిన నేపథ్యంలో కేసీఆర్ మంగళవారం పుష్కర స్నానం ఆచరించినా తప్పులేదని చెబుతున్నారు. దోషమని భావిస్తే గుడిలోకి వెళ్లకుండా ఉంటే సరిపోతుందని చెబుతున్నారు.