కూతురి నిశ్చితార్థం: డైనింగ్ రూంలోకూడా నిఘా
హైదరాబాద్: రేవంత్ రెడ్డి కూతురు నైమిశా రెడ్డి నిశ్చితార్తం వేడుకలో ఓ వైపు ఆనందం, మరో వైపు విషాదం చోటు చేసుకుంది. "ఆందోళన వద్దు, ఏమీ కాదు.." అని తెలంగాణ తెలుగుదేశం శాసనసభ్యుడు రేవంత్ రెడ్డికి పలువురు నాయుకులు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.
తన కూతురు నిశ్చితార్థానికి వచ్చిన అతిథులకు రేవంత్ రెడ్డి స్వాగతం చెబుతూ రేవంత్ రెడ్డి కనిపించారు. కానీ, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడలేదు. వేడుక యావత్తూ నవ్వుతూ కనిపించడానికి ఆయన ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో కూడా రేవంత్ రెడ్డి ఎక్కువగా మాట్లాడలేదు.
ఎక్కువగా మాట్లాడితే కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్లయి, పూర్తి స్థాయి బెయిల్ పొందడానికి ఇబ్బంది ఎదురవుతుందనే ఉద్దేశంతో ఆయన ఎక్కువగా మాట్లాడలేదని అంటున్నారు. వేడుక యావత్తూ రేవంత్ రెడ్డి కదలికలను తెలంగాణ నిఘా విభాగం, స్పెషల్ బ్రాంచ్, ఎసిబి అధికారులు గమనిస్తూ వెళ్లారు.
కేసు ప్రభావం వేడుకపై పడకుండా రేవంత్ రెడ్డి జాగ్రత్త పడ్డారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రేవంత్ రెడ్డిని డైనింగ్ రూంలో కూడా అనుసరించారు. అయితే, నివాసంలోకి మాత్రం అడుగు పెట్టలేదు, సందర్శకులపై గట్టి నిఘా పెట్టారు. నిజానికి, తన కూతురి నిశ్చితార్థానికి రేవంత్ రెడ్డి ఓ అతిథిలా హాజరయ్యాడు. గురువారం ఉదయం పూట నివాసానికి వచ్చి, ఆ తర్వాత వేడుకల్లో పాల్గొని, తిరిగి సాయంత్రం జైలుకు వెళ్లిపోయారు.