చంద్రబాబుకు షాక్: గులాబీ గూటికి మోత్కుపల్లి?
హైదరాబాద్: గవర్నర్ పదవి వస్తుందని ఇంతకాలం ఆశ పెట్టుకున్న మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తాజా పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి షాక్ ఇచ్చేందుకు సిద్ధపడినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరే అవకాశాలున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
వరంగల్ లోకసభ స్తానానికి ఉప ఎన్నిక జరుగబోతున్న తరుణంలో మోత్కుపల్లి టిఆర్ఎస్ వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుత తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి రాజీనామా చేయడంతో వరంగల్ (ఎస్సీ రిజర్వ్) లోకసభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.
తాజా పరిణామాల నేపథ్యంలో మోత్కుపల్లితో పాటు మరి కొంత మంది తెలంగాణ టిడిపి నేతలు ఆ పార్టీకి రాజీనామాలు చేసే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో మోత్కుపల్లి నర్సింహులు ఖమ్మం జిల్లా మధిర శాసనసభా స్థానం నుంచి టిడిపి తరఫున పోటీ చేసి ఓడిపోయారు.
ఆ తర్వాత ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తారని ప్రచారం సాగింది. అది ఆయన దాకా రాలేదు. ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాలకు మోత్కుపల్లిని గవర్నర్గా పంపే అవకాశాలున్నట్లు ప్రచారం సాగింది. నిజానికి, మోత్కుపల్లి టిడిపి నుంచి వరంగల్ లోకసభ స్థానానికి పోటీ చేయాలని అనుకున్నారు. అయితే, బిజెపి కూడా పోటీకి సిద్ధపడుతోంది. పైగా, తాజా పరిణామాలు టిడిపి అనుకూలంగా లేవని మోత్కుపల్లి భావిస్తున్నారు. ఈ స్థితిలోనే ఆయన టీఆర్ఎస్ వైపు చూస్తున్నట్లు వినికిడి.