ఎక్కడ దొరుకుతారు?: చంద్రబాబు దర్శనానికి పాట్లు!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలుసుకోవడం పార్టీ కార్యకర్తలతో పాటు సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. సీఎం చంద్రబాబు నిన్నటి వరకు హైదరాబాద్ కేంద్రంగా పాలన సాగించారు. ఇప్పుడు విజయవాడ కేంద్రంగా పని చేస్తున్నారు.
దీంతో, కార్యకర్తలు, సామాన్యులు ఆయనను కలుసుకునేందుకు ఇబ్బందులు పడవలసి వస్తోందని తెలుస్తోంది. గతంలో తొమ్మిన్నరేళ్ల పాటు చంద్రబాబు సీఎంగా ఉన్నారు. అప్పుడు నిత్యం సచివాలయంలో, పార్టీ కార్యాలయంలో, ఇంటివద్ద అందరికీ అందుబాటులో ఉండేవారు.
అయితే, ఈసారి మాత్రం ఎదురుచూపులు తప్పటం లేదని చెబుతున్నారు. ఇటీవల హైదరాబాదులో ఆయన సచివాలయానికి మారిన తర్వాత మరింత ఎక్కువగా ఇబ్బంది పడవలసి వస్తోందంటున్నారు. ఇప్పుడు విజయవాడలోను అదే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు.

సామాన్యులను సిఎం క్యాంప్ కార్యాలయానికి ఒకింత దూరంలో ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకే క్యాంప్ కార్యాలయంలోకి వెళ్లేందుకు సమస్యలు ఎదురవుతున్నాయంటున్నారు.
సిఎంను కలిసి సమస్య చెప్పుకుంటే పరిష్కారం అవుతుందని భావించే వారికి.. ఆయనను కలుసుకోలేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిన్నటి వరకు చంద్రబాబు హైదరాబాదులో ఉన్నారు. దీంతో, అక్కడ ఆయనను కలుసుకోవడానికి వచ్చిన వారు తమకు తెలిసిన వారి ఇళ్లలో రెండు మూడు రోజులు ఉండి అయినా ఎదురు చూసేవారు.
కానీ, విజయవాడలో ఆ పరిస్థితి లేదు. చంద్రబాబు ఏ రోజు అక్కడ ఉంటారో, ఏ రోజు జిల్లా పర్యటనలలో ఉంటారో తెలియని పరిస్థితి అంటున్నారు. అదే సమయంలో విజయవాడలో రెండు మూడు రోజులు ఉండేందుకు చాలామందికి ఇబ్బందులనే చెప్పవచ్చు. సందర్శకులకు నిర్ణీత సమయం కేటాయిస్తే బాగుంటుందంటున్నారు.












Click it and Unblock the Notifications