అమెరికన్లం, ఎన్నారైలంకాదు: బాబీజిందాల్ సంచలనం
వాషింగ్టన్: లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తల్లిదండ్రులు నాలుగు దశాబ్దాల క్రితం భారత్ నుండి అమెరికాకు వచ్చారని, అమెరికన్స్గా ఉండేందుకు వచ్చామని, ఇండియన్ అమెరికన్స్గా ఉండేందుకు కాదని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
బాబీ జిందాల్ వలసవాది అని, వంశమూలాలు అమెరికా భూభూగంలోనివి కాదని ఆయన పైన విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ వ్యాఖ్యల పైన ఆయన స్పందించారు. తన తల్లిదండ్రులు అమెరికన్ కలలు నెరవేర్చుకునేందుకు వచ్చారని, విజయం సాధించారన్నారు.

వారికి సంబంధించి ఇది కేవలం ఒక ప్రాంతం కాదని, ఒక ఆలోచన అన్నారు. మనం అమెరికన్లుగా ఉండేందుకు ఇక్కడకు వచ్చామని, ఇండియన్ - అమెరికన్లుగా ఉండేందుకు రాలేదని తన తల్లిదండ్రులు చెప్పారన్నారు. భారతీయులుగా ఉండాలని భావిస్తే తాము అక్కడే ఉండేవారమన్నారు.
అంతమాత్రాన భారత్ అంటే అయిష్టం కాదని చెప్పారు. మరిన్ని అవకాశాల కోసం, మరింత స్వాతంత్ర్యం కోసం తమ తల్లిదండ్రులు ఇక్కడకు వచ్చారన్నారు. అమెరికాలో ప్రవాసులు అనే దానిని తాను విశ్వసించనని చెప్పారు.
ఇండియన్ అమెరికన్, ఐరిష్ అమెరికన్, ఆఫ్రికన్ అమెరికన్, ఇటాలియన్ అమెరికన్, మెక్సికన్ అమెరికన్.. ఇవన్నీ సరికాదని అభిప్రాయపడ్డారు. అమెరికా లేదా ఏ ఇతర దేశమైన బలమైన ఆర్థిక వ్యవస్థను రక్షించడమే మొదటి స్టెప్ అన్నారు. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో బాబీ జిందాల్ కూడా ఉండే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.












Click it and Unblock the Notifications