టార్గెట్ 2019: పవన్తో పొత్తు, బిజెపిలోకి చిరంజీవి?
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్ష్ చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను, ఓ ఎమ్మెల్సీని తమ పార్టీలో చేర్చుకున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు బిజెపి కూడా ఆపరేషన్ ఆకర్ష్ను ప్రారంభించి పలువురు నేతలను తమ పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాగా, వచ్చే నెల(మార్చి 6న) ప్రముఖ సినీనటుడు, కాంగ్రెస్ రాజ్యసభ్యుడు చిరంజీవి కాషాయ కండువా కప్పుకుంటారనే వార్తలు ఊపందుకున్నాయి. ఇప్పటికే ఆయన సోదరుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బిజెపికి మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే.
కాగా, ఆంధ్రప్రదేశ్లో సొంతంగా ఎదగాలనే ఆలోచనలో ఉన్న భారతీయ జనతా పార్టీ కాపులకి ముఖ్యమంత్రి పదవి అనే ఎజెండాతో చిరంజీవిని తనవైపు తిప్పుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. కాపులు అత్యధికంగా ఉండే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మార్చి 6న బహిరంగసభ నిర్వహించి పార్టీ బలోపేతానికి శంఖారావం పూరించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా హాజరయ్యే ఈ సభలో చిరంజీవికి కాషాయ కండువా కప్పేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ చిరంజీవితో మంతనాలు సాగిస్తున్నారని అంటున్నారు.
చిరంజీవిని బిజెపిలో చేర్చుకుని, పవన్కల్యాణ్ జనసేన పార్టీతో పొత్తుపెట్టుకుని 2019 ఎన్నికల్లో బలమైన శక్తిగా ఎదగాలని కమలం పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. చిరంజీవిని పార్టీలోకి తీసుకువచ్చేందుకు ఓ వైపు నుంచి కన్నా, మరోవైపు నుంచి సోమువీర్రాజు తీవ్ర ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిసింది.
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ మళ్లీ పుంజుకునే అవకాశం లేకపోవడం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతుండడంతో బిజెపి బలపడే అవకాశాలు మెరుగయ్యాయని రాజకీయ విశ్లేషకుల భావిస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా సోమువీర్రాజును ప్రకటించి, చిరంజీవిని పార్టీలో చేర్చుకుని, కేంద్రంలో మంత్రిపదవి ఇవ్వడం.. ఇలా మొత్తంగా కాపులని తమవైపు తిప్పుకోవాలన్నది బిజెపి ఆలోచనగా తెలుస్తోంది.
మార్చి 6న పార్టీలో చేరమని చిరంజీవిపై ఒత్తిడి వస్తున్నా, మార్చిలో తన కూతురు శ్రీజ పెళ్లి ఉండడంతో ఆ హడావిడిలో ఉన్న చిరంజీవి ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
మార్చి 6న వీలుకాకపోతే, రాయలసీమలో మరో బహిరంగసభ పెట్టి అక్కడ రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి, ఆ వేదికపైనే చిరంజీవిని పార్టీలో చేర్చుకునే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ నిశితంగా పరిశీలించినట్లయితే చిరంజీవి బిజెపి పార్టీలో చేరడం దాదాపు ఖరారైనట్లేనని తెలుస్తోంది. ఏదేమైనా చిరంజీవి నిర్ణయం ప్రకటించిన తర్వాత స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.
పార్టీ మారడం లేదు: చిరంజీవి
పార్టీ మారతారన్న వార్తలపై చిరంజీవి బుధవారం స్పందించారు. తనకు పార్టీ మారాలన్న ఆలోచనే లేదని స్పష్టం చేశారు. బిజెపిలో చేరతానన్నది వదంతులేనని కొట్టిపారేశారు. సోషల్ మీడియాల్లో తాను బిజెపికి దగ్గరవుతున్నానని, బిజెపిలో చేరుతున్నానని వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని తేల్చి చెప్పారు. ఇలాంటి వార్తలకు పుల్ స్టాప్ పెడితే మంచిదని అన్నారు.