దమ్ముందా.. తొక్కిపడేస్తా!: టిడిపి నేతపై బిజెపి మంత్రి
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మిత్రపక్షాలు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఈ సందర్భంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఈలి నానికి మంత్రి మాణిక్యాల రావు సవాల్ విసిరారు.
చేతనైతే, దమ్ముంటే తాడేపల్లిగూడెం నుంచి ఢిల్లీ వరకు ఎక్కడైనా బహిరంగ చర్చకు సిధ్ధమని సవాల్ చేశారు. తాను ఓటమిపాలైతే రాజకీయ సన్యాసం చేస్తానని స్పష్టం చేశారు. ఆయన ఏం చేయాలో తాను చెప్పనని, ఆయనది నీచమైన స్థాయి అన్నారు.
పోలీసుల అండతో తాడేపల్లిగూడెంలో రౌడీయిజం చేయాలని చూస్తే తొక్కిపడేస్తానని హెచ్చరించారని తెలుస్తోంది. పట్టణంలో చోటుచేసుకుంటున్న ఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
కాగా, టిడిపి - బిజెపి మధ్య పైస్థాయిలో ఫ్రెండ్ షిప్ బాగానే ఉందని, కిందిస్థాయి నేతల్లో మాత్రం అది కనిపించడం లేదనే వాదనలు ఉన్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం పైన బిజెపి నేత సోము వీర్రాజు, పరోక్షంగా పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణలు నిత్యం విమర్శిస్తున్న విషయం తెలిసిందే.