మహేష్ బాబు బిజినెస్మేన్తో నయీంకు లింకేమిటి?
హైదరాబాద్: సినిమాల్లోని కొన్ని సంఘటనలు లేదా దృశ్యాలు అతిగా అనిపిస్తూ ఉంటాయి. నేల విడిచి సాము చేస్తున్నట్లుగా అనిపిస్తాయి. అదే సమయంలో వాస్తవికతకు దూరంగా ఉన్నట్లు కూడా ఫీలవుతాం. కానీ, నిజ జీవితంలో అటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు ఆ సినిమాల్లోని దృశ్యాలు నిజమే కదా అనుకోకుండా ఉండలేం
అలాంటిదే మహేష్ బాబు హీరోగా నటించిన బిజినెస్మేన్ చిత్రంలోని సంఘటన. పూరిజగన్నాథ్ దర్శకుడిగా మహేష్బాబు హీరోగా నటించిన బిజినెస్మ్యాన్ సినిమా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో మహేష్బాబు మాఫియా సామ్రాజ్యాన్ని సృష్టించిన విషయం కూడా తెలిసిందే.
ఈ సినిమాలోని ఓ సీన్కు, నయీంకు పక్కాగా సంబంధం కుదురుతోంది. "ప్రతీ టేబుల్పైనా మన గన్ ఉండాలి. సూర్యా ట్యాక్స్ పేరుతో పన్ను కట్టాల్సిందే. ఎవడైనా కట్టనని అంటే గన్ చూపించి బెదిరించండి" అని మహేష్ బాబు ఆ సినిమాలో అంటాడు. ఇది కేవలం సినిమా కథ అని కొట్టి పారేయాల్సిన పని లేదని నయీం ఉదంతం రుజువు చేస్తోంది.
ఎన్ఎమ్టి(నయీం ట్యాక్స్) పేరుతో నయీం డబ్బులు వసూలు చేశాడు. ఇవ్వలేమన్నవారిని బెదిరించాడు. అయినా దారికి రాకపోతే హత్య చేశాడు. నల్లగొండ జిల్లా భువనగిరిలోనే వంద మందికి పైగా నయీం ట్యాక్స్ చెల్లించిన వారున్నారని సిట్ దర్యాప్తులో తేలింది.
భూలావాదేవీలు, ఇల్లు నిర్మించాలన్నా, వ్యాపారం చేయాలన్నా, డబ్బుతో సంబంధమున్న ఏ పని ప్రారంభించాలన్నా నయీంకు ట్యాక్స్ చెల్లించాల్సిందే. వ్యక్తి స్థాయి, భూమి విలువను బట్టి రూ.10లక్షల నుంచి రూ.50లక్షల వరకూ వసూలు చేసినట్లు అనుమానిస్తున్నారు.