ఏపీకి తొందరెక్కువ: కెసిఆర్కు హోదాకు లింక్ పెట్టిన టిడిపి ఎంపీ!
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదా విషయంలో ఝలక్ ఇచ్చింది. బీజేపీ పైన అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలతో పాటు చాలామంది ధనుమాడుతున్నారు. టిడిపి నేతలు బిజెపిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి సమయంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ అవంతి శ్రీనివాస్ మాత్రం మరోరకంగా వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, ఆయన ప్రత్యేక హోదాకు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి లంకె వేసి మాట్లాడినట్లుగా తెలుస్తోంది.
ఏపీకి మొండిచేయి: హోదాపై తేల్చిసిన కేంద్రమంత్రి
ఏపీ ప్రజలకు తొందరెక్కువ అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలిచిన మరుసటి రోజు నుంచే ప్రత్యేక హోదా ఇవ్వాలేదు, రైల్వే జోన్ ఇవ్వలేదని అనడం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి పదకొండేళ్ల సమయం పట్టిందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్... నాడు పోరాటం ప్రారంభించగానే రాష్ట్రం ఏర్పడలేదన్నారు. ఆంధ్రా ప్రజలకు తొందరెక్కువని కొంచెం ఓపికగా ఉంటే ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు. హామీలు సాధించుకునేందుకు సహనం కావాలన్నారు. కేంద్రం ఏ రాష్ట్రం మీద కక్ష కట్టదని, అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తుందని చెప్పడం గమనార్హం.
మరోవైపు, బిజెపి నేత రఘునాథ్ బాబు కూడా ఉత్తరాఖండ్ గురించి ప్రస్తావించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంగా ఏర్పడిన రెండేళ్లకు గానీ ప్రత్యేక హోదా రాలేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రావడానికి సమయం పడుతుందని చెప్పారు. బిజెపి హోదా పైన హామీ ఇచ్చిందని, కచ్చితంగా ఇస్తుందని చెప్పారు. కొంత సమయం పడుతుందన్నారు.