ఆంజనేయస్వామి విగ్రహం కంట నీరు!
ఖమ్మం: జిల్లాలోని వైరా మండలం బ్రాహ్మణపల్లి అగ్రహారంలోని దాసాంజనేయస్వామి ఆలయంలో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ఆలయంలోని హనుమాన్ విగ్రహం కంటతడి పెడుతున్న దృశ్యం కనిపించింది.
స్థానికుల కథనం ప్రకారం.. బ్రాహ్మణపల్లిలో మూడేళ్ళ క్రితం ఆంజనేయస్వామి ఆలయం నిర్మించారు. ఈ క్రమంలో ఆలయ వార్షికోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఈ సంవత్సరం కూడా నిర్వహించాలని ఆలయ పూజారి సతీష్శర్మ ఆలయ పాలకమండలిలో ఒక సభ్యుడితో చర్చించారు. దీనిపై ఆగ్రహించిన ఆలయ కమిటీ అధ్యక్షుడు నాగేశ్వరరావు.. పూజారితో వాగ్వాదానికి దిగాడు. దీంతో గత రెండు రోజులుగా ఆలయం మూసివేశారు.

అనంతరం దిగివచ్చిన పాలకమండలి అధ్యక్షుడు అందరితో కలిసి తిరిగి తన పొరపాటును ఒప్పుకున్నారు. దీంతో అందరి సమక్షంలో పూజారి సోమవారం ఆలయ ద్వారాలు తెరిచారు. ఆ సమయంలో ఆంజనేయ విగ్రహం కంట నీరు కారుతున్న దృశ్యం అందరినీ ఆశ్చర్య పరిచింది.
ఈ విషయం జిల్లా అంతటా దావానంలా వ్యాపించింది. దీనితో వివిధ గ్రామాల నుండి భక్తులు తండోప తండాలుగా తరలివచ్చారు. స్థానికులు మాత్రం ఆంజనేయుడు కలతచెందడం వల్లే ఇదంతా జరుగుతోందని వ్యాఖ్యానించారు.
కాగా, అయితే గోడ చమర్చడంవల్లే ఈ నీరు వస్తోందని, అంతకు మించి మహత్తు ఏమీలేదని జనవిజ్ఞానవేదిక ప్రతినిధులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications