వ్యభిచార వృత్తిలా: కరుణపై బూతుపురాణం, క్షమాపణ
చెన్నై: తమిళనాడులో మే 16వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలు, నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో తమిళనాట.. నేతలు విరుచుకుపడుతున్నారు. తాజాగా, ఎండిఎంకె ప్రధాన కార్యదర్శి వైకో డిఎంకె అధినేత కరుణానిధి పైన తిట్ల వర్షం కురిపించారు.
అయన తిట్ల పురాణానికి రాజకీయ వర్గాలు, మీడియా కూడా నివ్వెరపోయింది. బుధవారం వైకో మాట్లాడుతూ... డిఎంకె పైన సంచలన ఆరోపణలు చేశారు. డిఎండికె అధ్యక్షులు విజయకాంత్ పైన ఆయన సొంత పార్టీ నేతల నుంచే తిరుగుబాటు జరిగేలా డిఎంకె వ్యూహం పన్నిందని ఆరోపించారు.

ఇందుకోసం డిఎండికె నేతలకు రూ.50 లక్షల నుంచి రూ.3 కోట్ల చొప్పున తాయిలాలు ఎరవేసిందని ఆరోపించారు. ఈ సందర్భంగా నాయీ బ్రాహ్మణ వర్గానికి చెందిన కరుణానిధిని టార్గెట్ చేస్తూ వైకో.. ఈ నీచం ఎలా ఉందంటే వ్యభిచార వృత్తి చేపట్టినట్టు ఉందని, నాదస్వరం (కరుణ పూర్వీకులు దేవాలయాల్లో నాదస్వరం వాయిస్తూ జీవనం సాగించేవారు)తో ఎవరిని ఎలా ఆడించాలో ఆయనకు బాగా తెలుసునని అన్నారు.
ఆ తర్వాత తన వ్యాఖ్యలకు నిరసనలు వ్యక్తం కావడంతో కరుణానిధికి బహిరంగ క్షమాపణ చెప్పారు. తన రాజకీయ గురువైన కరుణను, ఆయన కులాన్ని కించపరిచే వ్యాఖ్యలతో జీవితంలోనే పెద్ద తప్పు చేశానని, నేను ఎటువంటివాడినో కరుణకు బాగా తెలుసునని, ఆయనపై విమర్శలకు నేనే వణికిపోయానని, జీవితంలో నేను చేసిన పెద్ద నేరంగా దీనిని భావిస్తున్నానని, అందుకే ఆయనకు క్షమాపణ చెప్తూ.. పితృభావనతో మన్నిస్తారని భావిస్తున్నానని వైకో వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications