షాక్: ‘హెరిటేజ్’ వాహనంలో రూ.3కోట్ల విలువైన ఎర్రచందనం దుంగల తరలింపు
తిరుపతి గుండా హెరిటేజ్ వాహనంలో తరలిస్తున్న రూ.3కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
చిత్తూరు: తిరుపతి గుండా హెరిటేజ్ వాహనంలో తరలిస్తున్న రూ.3కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా స్మగ్లర్లు హెరిటేజ్ కంపెనీ పెయింట్ వేసిన వాహనంలో ఈ దుంగలను తరలిస్తుండటం గమనార్హం.
ఎర్రచందనం దుంగలు తరలిస్తున్నారని తెలియడంతో ఆ హెరిటేజ్ వాహనాన్ని పోలీసులు వెంబడించారు. దీంతో స్మగ్లర్లు పోలీసులపై రాళ్లు రువ్వారు. అప్రమత్తమైన పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. దీంతో భయపడిన స్మగ్లర్లు వాహనాన్ని రోడ్డుపైనే వదిలేసి పరారయ్యారు.
వాహనంలో రూ. 3కోట్ల విలువైన ఎర్ర చందనం దుంగలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. స్మగ్లర్లు.. తమిళనాడులో రిజిస్టరైన వాహనానికి ఏపీ నెంబర్ ప్లేట్ తగిలించారని చెప్పారు. ఈ నకిలీ హెరిటేజ్ వాహనాన్ని సీజ్ చేసినట్లు ఐజీ తెలిపారు. కాగా, హెరిటేజ్ పాల ఉత్పత్తుల కంపెనీ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కుటుంబానికి చెందిన వ్యాపారమనే విషయం తెలిసిందే.
అంతర్జాతీయ స్మగ్లర్ అరెస్ట్
చిత్తూరు జిల్లా పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా ఉన్న అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ కర్నాటకకు చెందిన హాజీ నాజిర్ను అరెస్టుచేసి, కారుతోపాటు నాలుగు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొన్నట్లు చిత్తూరు టాస్క్ ఫోర్సు డిఎస్పీ గిరిధర్ తెలిపారు. డిఎస్పీ కథనం మేరకు బెంగళూరు నగరానికి చెందిన హజీ నాజర్ (48) గత నాలుగేళ్లుగా దేశంలోనే ఎర్రచందనం అక్రమ రవాణాలో కీలకపాత్ర వహిస్తున్నట్లు చెప్పారు.
Recommended Video
జిల్లా పోలీసులుకు మోస్ట్వాంటెడ్గా ఉన్న హజీనాజిర్ను పట్టుకోవడానికి అనేకసార్లు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. సోమవారం ఉదయం కారులో బెంగళూరుకు వెళ్తున్నట్లు పక్కా సమాచారం రావడంతో పెనుమూరు క్రాస్వద్ద చిత్తూరు రూరల్ సిఐ చంద్రశేఖ్ర్ అతన్ని పట్టుకొని కారుతోపాటు అందులో ఉన్న నాలుగు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొన్నట్లు వివరించారు. హజినాజిర్ గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ, 2014 నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
ఇతనికి తమిళనాడు, సేలంతోపాటు దేశంలోని అనేక ప్రాంతాలకు చెందిన బడా స్మగ్లర్లతో పరిచాయాలు ఉన్నట్లు చెప్పారు. అనతి కాలంలోనే అంతర్జాతీయ స్మగ్లర్ గా ఎదిగి, ఎర్రచందనం దుంగలను మలేషియా, దుబాయి దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు. ఇతనపై చిత్తూరు జిల్లాలో సుమారు 20 కేసులు నమోదు అయినాయని , ఇప్పటి వరకు సుమారు వెయ్యి టన్నుల వరకు ఎర్రచందనం దుంగలను అక్రమంగా ఎగుమతి చేసినట్లు డిఎస్పి తెలిపారు.