కెసిఆర్ షాక్: ఒయులో అంత జరిగిందా, పరిస్థితిపై ఆరా?
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తన పట్ల పేరుకుపోయిన అసంతృప్తిని తెలుసుకుని కెసిఆర్ దిగ్బ్రాంతికి గురైనట్లు చెబుతున్నారు. పరిస్థితిపై ఆరాకు ఆయన కమిటీ వేశారని వినికిడి.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో హోరెత్తి ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు అప్పట్లో నీరాజనాలు పట్టిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లు తెలుస్తోంది. కెసిఆర్ అంటేనే విద్యార్థులు మండిపోతున్నట్లు చెబుతున్నారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో జరిగిన ఓ సంఘటన ఆయనను తీవ్రంగా కలవరపెట్టినట్లే కాకుండా అది తెలిసి ఆయన తీవ్రమైన దిగ్భ్రాంతికి గురైనట్లు చెబుతున్నారు. శతాబ్ది ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడకపోవడాన్ని అటుంచితే, అంతకు మించిన తీవ్రమైన సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.
ప్రారంభ కార్యక్రమాన్ని ఉస్మానియాలో లైవ్ టెలికాస్ట్ చేశారు. ఆ కార్యక్రమంలో కెసిఆర్కు సన్మానం జరిగింది. ఆ సన్మాన కార్యక్రమం లైవ్ కాకుండా చూసినట్లు తెలుస్తోంది. కెసిఆర్కు సన్మానం చేసిన సందర్భంలో లైవ్ ఆపేసి ఆర్ట్స్ కాలేజీని చూపించారని తెలుస్తోంది.
తెలిసి తీవ్ర దిగ్భ్రాంతి..
తనకు జరిగిన సన్మాన కార్యక్రమాన్ని ఎందుకు లైవ్ చేయలేదని కెసిఆర్ ఆరా తీస్తే అత్యంత చేదు నిజం బయటపడినట్లు తెలుస్తోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల్లో తనపై అంతగా వ్యతిరేకత ఉందనే విషయాన్ని ఆయన మొదటి సారి గుర్తించినట్లు చెబుతున్నారు.
ఏం జరుగుతోంది...
తనకు ఒకప్పుడు నీరాజనాలు పలికిన విశ్వవిద్యాలయంలో ఇంతగా వ్యతిరేత ఎందుకు చోటు చేసుకుందనే విషయాన్ని ఆయన ఆరా తీసినట్లు చెబుతున్నారు. తాను ఇన్ని మంచి పనులు చేస్తూ, బంగారు తెలంగాణను నిర్మించాలని ప్రయత్నిస్తుంటే ఈ వ్యతిరేకత ఎందుకు చోటు చేసుకుందనే విషయం ఆయనకు ఆర్థం కాలేదని అంటున్నారు.
పరిశీలనకు కమిటీ...
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తన పట్ల వ్యతిరేకతకు కారణమేమిటనే విషయాన్ని తెలుసుకోవడానికి ఓ కమిటీలాంటిది కెసిఆర్ వేశారని అంటున్నారు. వాస్తవాలు తెలుసుకునే బాధ్యతను హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, గ్యాదరి కిశోర్, పిడమర్తి, రవి, బాల్క సుమన్లకు కెసిఆర్ అప్పగించినట్లు తెలుస్తోంది. తనకు ఓ నివేదిక సమర్పించాలని కెసిఆర్ వారిని ఆదేశించారని అంటున్నారు.
తీవ్రమైన చర్చలు...
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిస్థితిని తెలుసుకోవడానికి కమిటీ సభ్యులు విశ్వవిద్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి అనుకూలంగా ఉండే విద్యార్థులతో రెండు రోజుల క్రితం చర్చించినట్లు సమాచారం. రాత్రి పొద్దు పోయే వరకు వారు విద్యార్థులతో మాట్లాడినట్లు చెబుతున్నారు.
కారణం ఇదీ...
జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపు ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని కెసిఆర్ పట్టించుకోవడం లేదని, విశ్వవిద్యాలయం పట్ల పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని విద్యార్థులు ఆ కమిటీ సభ్యులకు చెప్పినట్లు సమాచారం. దానివల్ల ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రతిష్ట దిగజారే పరిస్థితి ఏర్పడిందని వారు అబిప్రాయపడినట్లు సమాచారం. అంతేకాకుండా, ఉద్యోగాల భర్తీ విషయంలో జరుగుతున్న జాప్యం కూడా ఆందోళనలకు కారణమని వారు చెప్పినట్లు తెలుస్తోంది.