ముద్రగడకు షాక్: కాపుల పెత్తనమంటూ వ్యాఖ్య
కాపు ఉద్యమంలో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముద్రగడ పద్మనాభానికి షాక్ ఇచ్చే సంఘటన చోటు చేసుకుంది.
తిరుపతి: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభానికి షాక్ తగిలే పరిణామం చోటు చేసుకుది. కాపుల పెత్తనం సహించబోమంటూ టిటిడి పాలక మండలి మాజీ సభ్యుడు ఓవి రమణ ప్రకటన చేశారు. దీంతో కాపు ఉద్యమంలో చీలిక చోటు చేసుకుంటుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కాపులను గత 64 సంవత్సరాలుగా మోస్తూనే ఉన్నామనిస ఇక ఏ మాత్రం భరించలేమని బలిజలకు రాజకీయంగా న్యాయం జరగడానికి ప్రాణాలైనా అర్పిస్తామని నెలాఖరులోగా సిఎంను కలసి మాకు న్యాయం చేయాలని కోరుతామని ఓవి రమణ అన్నారు. తిరుపతిలో తన స్వగృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బలిజల్లో వెనుకబాటుతనంలో మహిళలు పడుతున్న అవస్థలు మాటల్లో చెప్పలేనంటూ ఆయన ఉద్వేగానికి గురై కంటతడిపెట్టారు.

కాపులను తాము ఇప్పటి వరకు వేరుగా చూడలేదని అన్నారు. అయితే బలిజలకు తీరని అన్యాయం జరుగుతున్నా వారు నోరు విప్పకపోవడంతో తాము పెదవి విప్పాల్సి వచ్చిందని తెలిపారు. కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి సింహభాగం వారే లబ్ధి పొందుతున్నారని ఆయన ఆరోపించారు. రాజకీయంగా లబ్ధి పొందిన వారు కాపులేనని, బలిజలు కనుచూపుమేరలో కూడా లేరని అన్నారు.
అందుకే నేడు రాయలసీమలో ఉద్యమం అనివార్యమైందని రమణ అన్నారు. ఏ విధంగా మున్నూరు కాపులు, తూర్పులకు రిజర్వేషన్లు ఇచ్చారో అలాగే బలిజలకు కూడా ఇవ్వాల్సి ఉన్నా వాటి గురించి ఆలోచించే నాథుడే కరవయ్యారని అన్నారు.. తాను బలిజలకు సంబంధించి మంజునాథ కమిషన్ను కలసి వినతిపత్రం ఇచ్చానని, ఆయన కూడా బలిజలకు జరుగుతున్న అన్యాయాన్ని సూత్రప్రాయంగా అంగీకరించారని అన్నారు.












Click it and Unblock the Notifications