మంతెన ఆరోగ్యాలయంలో అంత రేట్లా? కుండబద్దలు కొట్టిన రాజుగారు!
మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి చికిత్సా వైద్యశాల.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. అందరికీ ఈయన సుపరిచితులే. ఎన్నో ఏళ్లుగా విజయవాడ సమీపంలోని వెంకటపాలెం వద్ద.. కృష్ణా నది ఒడ్డున భారీ ఆరోగ్యాలయాన్ని (Nature Cure Hospital) ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు నిర్వహిస్తున్నారు. ఎలాంటి మందులు లేకుండా కేవలం యోగా, డైట్ (ఆహారం), సహజ పద్ధతుల ద్వారా దీర్ఘకాలిక వ్యాధులకు ఇక్కడ చికిత్స అందిస్తారు.
చాలా మందికి ఈ ఆరోగ్యాలయంలో చేరి చికిత్స చేయించుకోవాలని కోరిక ఉంటుంది. అయితే అక్కడి ధరలు ఎలా ఉంటాయి? రేట్ల గురించి బయట టాక్ ఏం నడుస్తోంది? ఎంతవరకు నేచురల్ చికిత్స మనకు పనిచేస్తుందనే అపోహలు చాలా మందికి ఉంటాయి. అలాగే అసలు సామాన్యులు మంతెన ఆశ్రమానికి వెళ్లలేరనే టాక్ కూడా పబ్లిక్లో ఉంది. అయితే తన ఆరోగ్యాలయంలో ఉండే రేట్ల గురించి డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు నేరుగా స్పందించారు.

ఆరోగ్యాలయంలో రేట్ల గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ గురించి తమ స్టాఫ్ తన దృష్టికి తీసుకువచ్చినట్లు వివరించారు. "రాజుగారు.. మీ ఆశ్రమం డబ్బులున్న వారికే" అని ఒకరంటే.. "సామాన్యులకు ఎటూ ఇది అందుబాటులో లేదు" అని మరికొందరు అనడంపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలిస్తే..
"హాస్పిటల్కు వెళ్లేది ఎప్పుడు? ఎమర్జెన్సీ వచ్చినప్పుడు. అప్పుడు రెండు మూడు రోజులుంటే రూ.30 వేలు, రూ.40 వేలు, రూ.50 వేలు కట్టినా.. ఎవరికీ ఎక్కువ అనిపించదు. కానీ నేచురోపతి హాస్పిటల్ అంటే ఎమర్జెన్సీ కాదు.. ప్రివెన్షన్ (వ్యాధులు రాకుండా జాగ్రత్త పడటం) గురించి. ఆరోగ్యాలయం రేట్లు చూసి బుక్ చేసుకునేటప్పుడు, కాల్ చేసినప్పుడు, ఆశ్రమానికి చేరే వరకు.. అందరూ 'రాజుగారు కాస్త రేటు ఎక్కువేమో' అనుకుంటూనే అడుగుపెడతారు. ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలిస్తే.. చేరిన వారు ఎవరూ ఆ మాట అనరు. బయట నుంచి చూసే వారే ఇలాంటి కామెంట్స్ చేస్తుంటారు, నేను వింటుంటాను" అని డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు పేర్కొన్నారు.
70 శాతం రూమ్ అద్దెలకే..
ఆరోగ్యాలయంలో 15 రోజులు ఒక పేషెంట్ ఉంటే తాము తీసుకునేది రూ.31,000, రూ.33,000 అని వెల్లడించారు. ఈ రెండు రకాల ధరలు 70 శాతం రూమ్ అద్దెలకే ఖర్చు అవుతాయని తెలియజేశారు. ఎందుకు అంత ఖర్చు అవుతుంది అంటే.. ఈ 15 రోజులు ఆశ్రమంలో ఉన్నప్పుడు అకామిడేషన్, మూడు పూట్ల డైట్, ఒకవేళ ఉపవాసం (ఫాస్టింగ్) చేస్తే పావు కేజీ తేనె, జ్యూస్ ఫాస్టింగ్లో రోజుకు నాలుగు ఐదు రకాల జ్యూసులు, ఫ్రూట్ ఫాస్టింగ్ చేస్తే మూడు పూట్ల ఫ్రూట్ డైట్ అందిస్తామని వివరించారు.
దీనితో పాటు అన్ని రకాల ఫిజియోథెరపీ ట్రీట్మెంట్స్, రోజుకు 3 సార్లు యోగా క్లాసులు ఉంటాయని వివరించారు. అలాగే 40, 50 రకాల నేచురోపతి ట్రీట్మెంట్స్, డాక్టర్ కన్సల్టేషన్, 1000 మంది సిబ్బందితో సర్వీసులు ఇవ్వడానికి 15 రోజులకు తాము రూ.31,000 మరియు రూ.33,000 తీసుకుంటే.. 'అమ్మో రేట్లు ఎక్కువ' అంటున్నారని వెల్లడించారు.
పిండి కొద్దిగా ఇస్తే రొట్టెలు ఎక్కువగా..
"ఇక్కడ లోపల అడుగుపెట్టక ముందే ఇలా అంటారు. కానీ తిరిగి వెళ్లేటప్పుడు ఆడవారు కూడా.. 'రాజు గారు! మీరు కొద్దిగా రేట్లు పెంచినా పర్లేదండీ, మేము ఇచ్చేది కొద్దిగా ఉంది, మీరు ఇచ్చే ఫెసిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి' అంటారు. అందుకే 'పిండి కొద్దీ రొట్టె' అంటారు కానీ, ఇక్కడ మీరు పిండి కొద్దిగా ఇస్తే రొట్టెలు ఎక్కువగా తాము ఇస్తున్నాం" అని తెలియజేశారు.
ఈ ఆరోగ్యాలయం లాభాల కోసమో, వ్యాపారం చేయడం కోసమో కాదని స్పష్టం చేశారు. 2010 లో తాము ఒక నిర్ణయం తీసుకున్నామని.. ఇదే తమ తొలి ఆశ్రమం, ఇదే చివరి ఆశ్రమం కూడా అని కుండబద్దలు కొట్టారు. కాగా, ఏపీ ప్రభుత్వ ప్రకృతి వైద్య సలహాదారుగా కూడా ఇటీవల కూటమి ప్రభుత్వం ఆయన్ను నియమించగా.. ప్రస్తుతం ఆయన కేబినెట్ హోదాలో కొనసాగుతున్నారు.














Click it and Unblock the Notifications